రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి..  ప్రధాని  మోడీకి  సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణకు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ అయిన ఆయన... రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన పలు ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు. ముఖ్యంగా సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడానికి వీలుగా... మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.


హైదరాబాద్ నగర రవాణా రంగాన్ని బలోపేతం చేసే మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రతిపాదనలకు తక్షణమే ఆమోదం తెలపాలని సీఎం కోరారు. మొత్తం 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు గానూ... 38,595 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పించామని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని ప్రధానిని అభ్యర్థించారు.

దీంతో పాటు రీజినల్ రింగ్ రోడ్ (RRR) పనులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం వాటా కింద ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) కి 626 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు కూడా పూర్తయిందని గుర్తు చేశారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉండే దక్షిణ కారిడార్ కూడా అంతే కీలకమని... ఈ రెండు కారిడార్లను ఒకేసారి ఆమోదించి పనులు ప్రారంభించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ కల్పించేలా... హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. 12 లేన్లతో ప్రతిపాదించిన ఈ మెగా హైవే ద్వారా తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు భారీగా లబ్ధి చేకూరుతుందని వివరించారు.

మరోవైపు ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి మైలురాయిగా నిలిచే వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరారు. దీనికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించినట్లు తెలిపారు.

విద్యారంగంలో తెలంగాణను మరింత ముందంజలో ఉంచేందుకు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఐఐఎం (IIM) ఏర్పాటు చేయాలని  రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. దీనికి అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్ వంటి జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయని... ఐఐఎం కూడా వస్తే నూతన విద్యా విధానం-2020 లక్ష్యాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.