బెల్లంపల్లి-గడ్చిరోలి గ్రీన్ఫీల్డ్ హైవేపై చిగురిస్తున్న ఆశలు.. మూడు రాష్ట్రాలను కలపనున్న రహదారి

బెల్లంపల్లి-గడ్చిరోలి గ్రీన్ఫీల్డ్ హైవేపై చిగురిస్తున్న ఆశలు.. మూడు రాష్ట్రాలను కలపనున్న రహదారి
  • పూర్తయిన సర్వే, మూడేండ్ల కిందటే అనుమతులు
  • ముడి ఇనుము రవాణా, మైనింగ్​కు అనుకూలం

కోల్​బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం భారత్​ మాల స్కీమ్​లో భాగంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారిపై ఆశలు రేకెత్తుతున్నాయి. బెల్లంపల్లి–-గడ్చిరోలి గ్రీన్​ఫీల్డ్  ఫోర్​ లేన్  హైవేను మంచిర్యాల జిల్లా తాండూర్​ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు 63.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. 

ఈ రహదారి ఏర్పాటుకు మూడేండ్ల కింద అనుమతులు రాగా, ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాథమిక సర్వే కూడా పూర్తి చేశారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లోని 8 మండలాలను కలుపుతూ రహదారి వెళ్లనుంది. రోడ్డు నిర్మాణానికి సుమారు 1,200 ఎకరాల భూమి సేకరించనున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో గ్రీన్​ఫీల్డ్  హైవేపై ఆశలు చిగురిస్తున్నాయి. 


మూడేండ్ల కిందే అనుమతులు


కేంద్ర ప్రభుత్వం భారత్​ మాల స్కీమ్​లో భాగంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు హైవే నిర్మాణానికి మూడేండ్ల కింద అనుమతులు ఇచ్చింది. భూసేకరణ కోసం మొదట మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సర్వే పూర్తి చేయగా, 2023లో తెలంగాణ ప్రభుత్వం కుమరంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలంలో సర్వే చేపట్టింది. కాగజ్​నగర్​ మండలం మోసం, సిర్పూర్(టి) మండలం చింతకుంట, పెద్దబండ, లక్ష్మీపూర్​ సమీపంలోని ఫారెస్ట్​ గుండా సర్వే చేపట్టగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అనుమతులు రాక పనులు నిలిపేశారు.


8 మండలాల మీదుగా..


మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లోని 8 మండలాల మీదుగా హైవేను నిర్మించనున్నారు. తాండూరు మండలం అన్నారం, గంపాలపల్లి, అచ్చలాపూర్, చంద్రపెల్లి, రాంపూర్, కత్తెర్ల, ద్వారకాపూర్, బోయపల్లి, కాసీపేట, మదనాపూర్​ మీదుగా బెల్లంపల్లి మండలం చాకెపల్లి, అంకుసం, భీమిని మండలం కేస్లాపూర్, కొత్తగూడ, లక్ష్మీపూర్, కమలాపూర్, పోతెపల్లిని కలుపుతూ రోడ్డు వేయనున్నారు. 

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని రెబ్బెన మండలం జక్కపల్లి, దహేగాం మండలం రాళ్లగూడ, జెండాగూడ, ఇటిక్యాల, బోర్లకుంట, కాగజ్​నగర్​ మండలం అనుకొడ, మండువా, గన్నారం, మోసం, నాగంపేట, రాస్పెల్లి, జంబుగ, సిర్పూర్(టి) మండలం లోనవెల్లి, పారిగాం, టోంకిని, లక్ష్మీపూర్, వెంకట్రావుపేట, హీరాపూర్, చింతకుంట, ఆరెపల్లి, చుంచుపెల్లి, కౌటల మండలం కుంభారీ, సాండ్​గాం, కౌటి, పార్డీ గ్రామాల మీదుగా హైవే వెళ్తుంది. 

వీరవెల్లి గ్రామానికి సరిహద్దున ప్రవహిస్తున్న వార్ధా నది మీదుగా మహారాష్ట్రలోని కిర్​మిరి గ్రామం నుంచి గడ్చిరోలి వెళ్లే హైవేకు ఈ ఫోర్​లేన్​ను అనుసంధానం చేయనున్నారు. మహారాష్ట్రలోని దాబా, ఘాట్, చామెర్షి, గోవింద్​పూర్​ మీదుగా గడ్చిరోలి జిల్లా వరకు రహదారి నిర్మిస్తారు. గ్రీన్​ఫీల్డ్​ హైవే పనులు కోసం రెండు జిల్లాల పరిధిలోని 8 మండలాల్లో 1200 ఎకరాల వరకు భూమి సేకరించనున్నారు.

 బిజినెస్​ ప్రాసెస్​ రీ ఇంజనీరింగ్​ ప్రక్రియలో భాగంగా మూడేండ్ల కింద కాగజ్​నగర్, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో ఆఫీసర్లు సర్వే చేశారు. బీపీఆర్​ తయారైన వెంటనే భూసేకరణ కోసం నోటిఫికేషన్​ జారీ చేయడానికి అప్పటి కాగజ్ నగర్​ ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించారు. 

మూడు రాష్ట్రాల్లో  మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ

హైవే నిర్మాణంతో తెలంగాణ,-మహారాష్ట్ర మధ్య బంధాలు మరింత బలపడనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలను కలిపే కారిడార్​గా మారనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే వ్యాపార, వ్యాణిజ్య, వస్తుమార్పిడిలో చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. తాజాగా గడ్చిరోలి జిల్లా సూర్జాగఢ్​లో ముడి ఇనుము ఫ్యాక్టరీ, మైనింగ్​ కార్యకలాపాలు ప్రారంభం కాగా, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్​ ప్రాంతాలకు రాకపోకలు జరుగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్​ సమస్య తొలిగి రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది. 

ఈ హైవే పనులు చేపట్టాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి స్థానిక ప్రజాప్రతినిధులు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. తాజాగా సిర్పూర్​ ఎమ్మెల్యే హరీశ్​బాబు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించగా, ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో రెండు జిల్లాల వాసుల్లో ఆశలు రేకేత్తుతున్నాయి.