
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లాలో 8 మంది మావోయిస్టులు శనివారం ఎస్పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు మిలీషియా సభ్యులకు రివార్డ్ కింద తక్షణ సాయంగా రూ. 25 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ పోరు కన్నా ఊరు మిన్న’ ‘ మన ఊరికి తిరిగి రండి’ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పోలీస్ శాఖ కల్పిస్తున్న సదుపాయాలపై తెలుసుకొని మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవనం గడపడానికి ముందుకొచ్చి జన జీవన స్రవంతిలో కలుస్తున్నారన్నారు.
లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా జరవడ్డ గ్రామానికి చెందిన డివిజన్ కమిటీ సభ్యుడు దొర్పెట్టి మిర్గు అలియాస్ లింగ అలియాస్ శివలాల్, చత్తీస్ గఢ్ కు చెందిన ఏరియా కమిటీ సభ్యులు మడవి టిడో, మిడియం బీమా, సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేష్, సోయం భీమే, మడవి మడక, మదవి ఇడుమ ఉన్నారన్నారు. ఎనిమిది మంది మావోయిస్టులు వివిధ కేడర్లలో పని చేశారన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 355 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డిఎస్పి రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు తిరుపతిరావు, తాజుద్దీన్, సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.