వచ్చే మార్చి 2న జరగబోయే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా మీ పీఎఫ్ (PF) డబ్బు పై 8.25% వడ్డీని కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. అయితే గత రెండు ఏళ్లుగా ఇదే రేటు కొనసాగుతుండడం గమనార్హం.
ప్రస్తుతానికి వడ్డీ చెల్లించడానికి సరిపడా లాభాలు EPFO దగ్గర ఉన్నాయి. దాదాపు రూ. 28 లక్షల కోట్ల భారీ ఫండ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ నిధులను ప్రభుత్వం సేఫ్ డిపాజిట్లు (65% వరకు), షేర్ మార్కెట్/ETFలు (15% వరకు) ఇతర షార్ట్ టర్మ్ లోన్లలో పెట్టుబడిగా పెడుతుంది.
కొత్తగా రాబోతున్న మార్పులు:
భవిష్యత్తులో మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా EPFO సబ్స్క్రైబర్లకు నష్టం కలగకుండా, ఎప్పుడూ ఒకే రకమైన వడ్డీ ఇచ్చేలా 'వడ్డీ స్థిరీకరణ నిధి' (Interest Stabilisation Fund) ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. వెబ్సైట్ను అప్గ్రేడ్ చేయడం ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా, సెటిల్మెంట్లు మరింత వేగంగా జరిగేలా టెక్నాలజీ మార్పులు చేయనున్నారు.
అక్టోబర్ 2025లో జరిగిన సమావేశంలో ఇప్పటికే కొన్ని వెసులుబాటులు ఇచ్చారు. మార్చి 2న జరిగే మీటింగ్లో మరిన్ని సామాన్య ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 8.25% వడ్డీ రేటు మార్కెట్లోని ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కంటే మెరుగ్గానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
