
- తప్పించుకుని పారిపోకుండా పహారా
- దళారుల ఆగడాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు
నాగర్కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా తీరంలో వలస కూలీలతో చేపలు పట్టిస్తూ వ్యాపారులు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. దళారుల అండతో రెచ్చిపోతున్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కూలీలు తప్పించుకుని పోకుండా పహారా కాస్తున్నారు. చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురి చేసే దళారుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాలకు చెందిన అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, జటప్రోల్ తీర ప్రాంతాల్లో చేపట వేట, అమ్మకాలు నిర్వహించే దళారుల అక్రమ దందాకు అడ్డాగా మారింది. ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించుకుంటున్న దళారులు ఇష్టారీతిన పని చేయించుకుంటూ నరకం చూపిస్తున్నారు. కృష్ణాతీరంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్, లేబర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నేతలతో కలిసి దందా నడిపించుకునే చేపల మాఫియా ఆగడాలకు అడ్డుఅదుపు లేదని తెలుస్తోంది.
39 మందికి విముక్తి..
ఓ స్వచ్ఛంద సంస్థ పోరాటంతో గత నెల 26న ఇతర రాష్ట్రాలకు చెందిన39 మంది వలస కూలీలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి లభించింది. జిల్లా అధికార యంత్రాంగం వారికి కొంత పరిహారం ఇప్పించి వారి స్వస్థలాలకు చేర్పారు. అయితే ఈ వ్యవహారంలో ఎంత మంది దళారులపై కేసులు నమోదు చేశారనే విషయంపై స్పష్టత లేదు. కృష్ణానదిలో చేపల వేట, వలలు వేయడం, చేపలు ఎండబెట్టడం, బాక్సుల్లో నింపడం, డీసీఎంలో లోడ్ చేయడం వంటి పనులకు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఎంచుకుంటున్నారు. ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్రాష్ట్రాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాల వద్ద యాచకులు, అడ్డా కూలీలను టార్గెట్ చేస్తున్న బ్రోకర్లు, డబ్బుల ఆశ చూపించి కృష్ణా తీరానికి తరలిస్తున్నారు.
తిండిపెట్టి రోజుకు రూ.300 కూలీ ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలో కృష్ణానదికి ఆనుకుని ఉండే కొండ గట్లు, నది ఒడ్డున ఇసుకలో క్యాంపులు వేసి రోజుకు 14 గంటలు పని చేయిస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారు నదిలో మునిగి చనిపోతున్నారు. గత ఏడాది నాగయ్య, సుమన్ పని ఒత్తిడి తట్టుకోలేక కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి అమరగిరి వరకు చేతులతో తెప్పను తోసుకుంటూ వెళ్లారు.
ఎటు వెళ్లాలో తెలియక ఆకలికి అలమటిస్తూ రెండు రోజులు అడవి మధ్యలో ఉన్నారు. అటు నుంచి వచ్చిన మరబోటులో సోమశిలకు తిరిగి వస్తూ చీకట్లో తీరం వచ్చిందని భావించి నీళ్లలో దూకారు. సుమన్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, నాగయ్య(20) వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా, మృతుడి వివరాలు తెలియక అనాథ శవంలా కొల్లాపూర్లో ఖననం చేశారు. తమను రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చారని ప్రాణాలతో బయటపడిన సుమన్ (21)
తెలియజేశాడు.
అడ్రస్ లేనివారే టార్గెట్..
కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండల కేంద్రాలను అడ్డాలుగా మార్చుకుంటున్న దళారులు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించి కృష్ణాతీరానికి తరలిస్తారు. ప్రధానంగా అడ్రస్ లేని వారినే ఇక్కడికి తరలిస్తుంటారు. వీరు చనిపోయినా అడిగేవారు, కేసుల పంచాయితీ ఉండదు. దీంతో ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుంటారు. ఎన్ని ఘటనలు జరుగుతాయనే విషయం బయటకు పొక్కనీయరు. ప్రొఫెషనల్ మత్య్సకారులకు 6 నెలలకు రూ.2 లక్షల వరకు ఇస్తామని కాంట్రాక్ట్ చేసుకుంటారు.
పగలు నిద్ర, రాత్రి వేళలో అలవి వలలతో నదిని జల్లెడ పడతారు. అలవి వలలను నిషేధించామని అధికారులు చెప్పినా, ఇక్కడ మాత్రం వాటినే వాడుతున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి కృష్ణా నదిలో చేప పిల్లలు వదులుతుంటే, రోజులు గడవకముందే అవి అలవి వలలకు చిక్కుతున్నాయి. ఇలా దళారులు కబ్జా చేయడంతో స్థానిక మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతోంది.