- హుజూరాబాద్ ప్రజలు తలుచుకుంటే దొంగల ముఠా తోకముడవడం ఖాయం
- హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
హనుమకొండ జిల్లా: ‘‘నాపై ఇప్పటి వరకు నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారు... దళిత బంధు వద్దు అని రాశానని ప్రచారం చేస్తే.. అలాంటి ఉత్తరం రాలేదని చెప్పి ఎన్నికల కమిషన్ చెంప చెళ్లుమనిపించింది..’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు తలచుకుంటే దొంగల ముఠా తోకముడవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ తో తెలంగాణ తెచ్చుకున్నామని, అయితే ఉద్యోగాలు వాళ్ల కుటుంబానికి వచ్చాయి., కానీ మనకు రాలేదన్నారు. మన పిల్లలకు గొర్రె పిల్లలు ఇచ్చి.. ప్రజలు గొర్రెలనుకుంటున్నాడు కేసీఆర్ అన్నారు.
ఫించన్, దళితబంధు, రేషన్ కార్డు ఇస్తే మోసపోయి ఓటేస్తాడని కేసీఆర్ అనుకుంటాడు
ఫించన్, దళితబంధు, రేషన్ కార్డు ఇస్తే మోసపోయి ఓటేస్తాడని కేసీఆర్ అనుకుంటాడని, కానీ ఈసారి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటికి ఇద్దరు పట్టభద్రులున్నారని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తే ఉద్యోగాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాదు ఈటల రాజేందర్.. ఎన్నికల రిజల్ట్ తరువాత తెలంగాణలో అగ్గి పెడతా.. కేసీఆర్ పీఠం కూల్చుతా.. యావత్ తెలంగాణ ప్రజలారా మా హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉండండి..’ అని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ప్రజలారా మీరు తలుచుకుంటే దొంగల ముఠా తోకముడవడం ఖాయం అన్నారు.