
- ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రాకు జర్నలిస్టుల సొసైటీ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 25/2 లోని 38 ఎకరాల భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది.
గతంలో ఈ భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం 2008లో కేటాయించింది. ఈ మేరకు ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ హెచ్ఎండీఏ కస్టడీలో ప్రభుత్వం ఉంచింది. అయితే ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడంతో అక్కడ జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ జరగలేదు.
కోర్టులో వివాదం ఉండగానే.. మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రాకు సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించుకుంది.
ఇప్పటికే కొంతమంది ఇండ్లు కట్టుకుని ఉండగా.. వాటి జోలికి పోకుండా ఇంకా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ విషయమై కొంతమంది అభ్యంతరాలు వక్తం చేయగా.. కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈ లోగా ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే ఇక్కడ ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.