వైన్ షాపులో అగ్ని ప్రమాదం...మంటల్లో రూ. 5 కోట్ల మద్యం బాటిళ్లు

వైన్ షాపులో అగ్ని ప్రమాదం...మంటల్లో  రూ. 5 కోట్ల మద్యం బాటిళ్లు

హర్యానా  గురుగ్రామ్‌లో ఓ వైన్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సెక్టార్ 55లోని ఓ మద్యం దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో ఫుల్ స్టాక్ ఉండటంతో మంటల ధాటికి క్కర్ బాటిళ్లు  బాంబుల్లా పేలిపోయాయి. మే 14వ తేదీ ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. షాపు మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలోని సెక్టార్ 55 వద్ద గల మద్యం దుకాణంలో  మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గంటన్నర పాటు  శ్రమించి మంటలను ఆర్పేశారు. 

మంటలను ఆర్పే  ప్రయత్నంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి  స్వల్ప గాయాలు అయ్యాయి.  మంటల ధాటికి బాటిళ్లు పేలడం వల్ల వారికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే షాపులో  షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల రూ. 5 కోట్ల రూపాయాల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు.