
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేఛ్చకు ఉందన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన జూపల్లిని అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదన్న సిబ్బందితో జూపల్లి వాగ్వాదానికి దిగారు. స్పీకర్ అనుమతి తీసుకోవాలని భద్రతా సిబ్బంది జూపల్లికి సూచించారు. ప్రగతి భవన్ డైరక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారంటూ జూపల్లి ఫైరయ్యారు.
తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు జూపల్లి. మీ బండారం బయట పెడతానని, తనకు భయపడి సస్పెండ్ చేశారన్నారు . గత రెండు, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వం చేసే బుక్ కూడా ఇవ్వలేదన్న జూపల్లి.. తనకు బీఆర్ఎస్ లోనే ఉన్నానా లేదా అనే అనుమానం ఉండేదన్నారు.
తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశానాని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిలో తాను ఒకరినని తెలిపారు.. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తన ఇష్టం అన్నట్లుగా పాలన చేస్తున్నారని జూపల్లి విమర్శించారు. ఇక తన ఓటమికి ప్రభుత్వ పెద్దలే కారణమని జూపల్లి ఆరోపించారు. గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తన చేతిలో ఓడిపోయారని గుర్తుచేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జూపల్లి కృష్ణారావుతో పాటుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.