
- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్లో రవాణా, పోలీస్, వైద్యారోగ్య శాఖ, ఇన్సూరెన్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. దీనికింద రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అందుతుందని చెప్పారు.
ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆస్పత్రిలో చేరితే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎంప్యానెల్ అయిన ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్ అందిస్తారన్నారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. దీనిపై అన్ని పోలీస్టేషన్లలో అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్ను ఆదేశించారు.