
- రెడ్ సిగ్నల్స్ పడ్డప్పుడు 60 సెకండ్లపాటు తనిఖీలు: ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్
- స్కూల్ బస్సు డ్రైవర్లు తాగి దొర్కుతున్నందునే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడి
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు డే టైమ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నాలుగు వైపులా రెడ్ సిగ్నల్ పడిన సమయంలో 60 సెకండ్ల పాటు తక్కువ సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. సుల్తాన్ బజార్ పరిధిలో శుక్రవారం 10 మంది , శనివారం 8 మంది తప్పతాగి బండ్లు నడుపుతూ పట్టుబడ్డారు. సోమవారం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పీఎస్పరిధిలోని కోఠి రంగమహల్ సర్కిల్లో ట్రాఫిక్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డే టైమ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
మద్యం తాగి బండి నడిపిన ఐదుగురిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలతో గత నాలుగు రోజుల నుంచి డే టైమ్లో సర్ప్రైజ్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. గత నెల రోజులుగా స్కూల్స్ వద్ద చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 35 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేసిందని తెలిపారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడ్డారని, ఓ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 400 పాయింట్స్ వచ్చిందన్నారు. దీంతో ఈ డే టైం స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించినట్టు చెప్పారు. మద్యం తాగి పట్టుబడిన స్కూల్ వెహికల్స్ డ్రైవర్లకు మోతాదు బట్టి జైలు శిక్ష కూడా పడిందన్నారు.
ఈ సర్ప్రైజ్తనిఖీల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా.. రెడ్ సిగ్నల్స్ పడినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో మార్పు వచ్చే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాములు , ఏసీపీ ఏ
శ్రీనివాసులు , సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సీఐ రాంబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.