దళితులను దగా చేస్తే చావు డప్పు కొట్టడం ఖాయం

దళితులను దగా చేస్తే చావు డప్పు కొట్టడం ఖాయం
  • ఈటలతో గోక్కొని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు
  • బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ 

హనుమకొండ జిల్లా: దళితులను దగా చేస్తే చావు డప్పు కొట్టడం ఖాయమని, టీఆర్ఎస్ వాళ్లు ఈటల రాజేందర్ తో గోక్కొని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్లకి బుల్లెట్ దిగాలన్నారు.  ఈటెల రాజేందర్  ప్రజల మనిషి అని, హుజురాబాద్ ప్రజల మీద నమ్మకం లేక హరీష్ రావు, సిద్దిపేట నియోజకవర్గ  నాయకులను తీసుకువచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. 
కేసీఆర్ వి లొట్టపెట్ట పెదవులు
కేసీఆర్ వి లొట్ట పెట్ట పెదవులు అని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని  అనలేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధం చెబుతున్నారని, దళిత బంధు ఇవ్వకపోతే కేసీఆర్ నీకు రాజకీయ సమాధి కట్టుడు ఖాయమన్నారు. ఈనెల 30వ తేదీ తర్వాత  ఇప్పుడు వస్తున్న నాయకులు ఎవరూ కనబడరని, మళ్లీ కనిపించేది, పనిచేసేది మన ఈటల రాజేందర్ మాత్రమే అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుందాం.. ఓటు మాత్రం మన రాజేందర్ అన్నకు వేసుకుందామని ఆమె సూచించారు. నీతిగల రాజేందర్ మీద కల్తీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చల్లా ధర్మారెడ్డి  చంద్రబాబు చంకలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. 
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ మాట్లాడుతూ పరకాల ధర్మా రెడ్డి నువ్వు రెడ్డి బిడ్డవేనా?  పోదామా?  మీ నియోజక వర్గం.  చేద్దామా నీవు చేసిన అభివృద్ధి మీద చర్చ అని సవాల్ చేశారు.