
- నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నయ్: మంత్రి పొంగులేటి
- ఇప్పటి వరకు 68.08 కోట్లు లబ్ధిదారులకు అందజేసినం
- నిధుల కోసం ఎదురుచూడకుండా రిలీజ్ చేస్తున్నం
- లబ్ధిదారుల ఆహ్వానం మేరకు గృహ ప్రవేశాలకు హాజరవుతానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే గృహప్రవేశాలు జరుగుతాయని.. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వీలైన చోట్ల గృహప్రవేశాలకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియెట్లో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి సమీక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 7,824 ఇండ్లు బేస్మెంట్ లెవల్, 895 ఇండ్ల గోడల నిర్మాణం, 64 ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని, లబ్ధిదారులు ఒక్క రోజు కూడా నిధుల కోసం ఎదురుచూడకుండా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు బేస్మెంట్ పూర్తైన 5,682 ఇండ్లకు రూ. 56.82 కోట్లు, గోడలు పూర్తైన 497 ఇండ్లకు రూ.9.94 కోట్లు, శ్లాబ్ పూర్తైన 33 ఇండ్లకు రూ. 1.32 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.
మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.68.08 కోట్లు అందజేశామన్నారు. గత సోమవారం నాటికి బేస్మెంట్ పూర్తైన 5,140 ఇండ్లకు రూ.51.40 కోట్లు, ఈ సోమవారం 1,072 ఇండ్లకు రూ.10.72 కోట్లు, గోడలు పూర్తైన 306 ఇండ్లకు రూ. 3.06 కోట్లు, శ్లాబ్ పూర్తైన 33 ఇండ్లకు రూ.0.66 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రమే చేస్తుందని, నిర్మాణ బాధ్యతలను లబ్ధిదారులకే అప్పగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. లబ్ధిదారులు తమ స్థలానికి అనుగుణంగా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఇష్టమైన రీతిలో ఇండ్లు నిర్మించుకోవచ్చని, రాష్ట్రంలో 250 మండలాల్లో ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ఇంజినీర్లు లబ్ధిదారులకు సహకారం అందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఆర్మూర్, కూసుమంచి ఎస్ఆర్వో ఆఫీసుల్లో ఆధార్-ఈ సంతకం
త్వరలో రాష్ట్రమంతా అమలు: మంత్రి పొంగులేటి
సబ్ రిజిస్ర్టార్ ఆఫీసుల్లో ఆధార్ -ఈ సంతకం వ్యవస్థను ప్రవేశపెట్టాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ విధానంతో 10–-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆధార్ -ఈ సంతకం తక్షణమే అమలవుతుందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ తో మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి రహిత, పారదర్శక, సమయ-సదుపాయక రిజిస్ట్రేషన్ కోసం జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తామన్నారు. స్లాట్ బుకింగ్ అమలులో సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పటాన్చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనపు ఎస్ఆర్ఓలను నియమించామన్నారు. సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి దూరంగా, మెరుగైన సేవలతో ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాలని అధికారులను మంత్రి కోరారు.
ఇందిరమ్మ ఇల్లు వచ్చింది .. చాలా సంతోషంగా ఉంది
మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్, గోడల వరకు రూ.2 లక్షలు ఇచ్చారు. స్లాబ్ కూడా వేశాము. సొంత ఇల్లు ఉండాలన్న మా కోరికను రేవంత్ రెడ్డి సార్ తీర్చారు. - ఉమ, ఖమ్మం జిల్లా
ఇల్లు ఇచ్చిన సీఎం సార్కు.. సన్న బియ్యంతో భోజనం పెడ్తా
ఇన్ని రోజులు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. రేవంత్ రెడ్డి సార్ ఇల్లిచ్చిండు. డబ్బులు కూడా ఇస్తున్నారు. స్లాబ్కు రూ.2 లక్షలు వచ్చినయ్. రేవంత్రెడ్డి సార్, పొంగులేటి సార్ మా గృహ ప్రవేశానికి రావాలి. యాటను కోస్తా సీఎం సార్ ఇస్తున్న సన్న బియ్యంతో భోజనం పెడ్తా. - లక్ష్మి, నాగిరెడ్డి పల్లి గ్రామం, కొడంగల్ బొమ్మరాస్ పేట మండలం
ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదు
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నాకు ఇద్దరు పిల్లలు. ఆడపిల్లను లా చదివిస్తున్నా. మగ పిల్లాడ్ని బీటెక్ చదివిస్తున్నా. గుడిసెలో ఉంటున్నాం. ఆ రేవంత్ రెడ్డి సార్ దేవుడిలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. సీఎం సార్వచ్చి మా ఇంటి రిబ్బన్ కట్ చేయాలి. - సుభావతి, నిర్మల్ జిల్లా