- ఎవరైనా పోటీ చేయొచ్చన్న సోనియా గాంధీ
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
- ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
- అక్టోబర్ 17న పోలింగ్
- అక్టోబర్ 19న కౌంటింగ్, రిజల్ట్ ప్రకటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్పదవికి సీనియర్ లీడర్ శశిథరూర్ పోటీ పడనున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆమోదం కూడా లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు సోమవారం పార్టీ లీడర్లు దీపేంద్ర హుడా, జై ప్రకాశ్ అగర్వాల్, విజేంద్ర సింగ్లతో కలిసి శశిథరూర్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన సోనియాకు వెల్లడించినట్లు సమాచారం. కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఎన్నికల్లో పార్టీ నేతలు ఎవరైనా పోటీ చేయొచ్చని సోనియా స్పష్టంచేసినట్లు తెలిసింది. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుందని పార్టీ ఎంపీ జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలు ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం నుంచి తప్పించాలని, కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలని ఆ పార్టీలోని అసంతృప్త నేతలు (జీ23 గ్రూప్) చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ గ్రూప్లో శశిథరూర్ లేనప్పటికీ కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పారదర్శకంగా నిర్వహించాలంటూ ఏఐసీసీ ఎలక్షన్ అథారిటీకి శశిథరూర్ లెటర్ కూడా రాశారు.
మరో అభ్యర్థి గెహ్లాట్..
పార్టీ ప్రెసిడెంట్ పదవి బరిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తోంది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న గెహ్లాట్ ఈ ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 26న కాంగ్రెస్ చీఫ్ పదవికి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం.
రాహుల్ పోటీలో లేనట్లే..
పార్టీ అధ్యక్ష పదవి రేసులో రాహుల్ గాంధీ లేనట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పగ్గాలను మళ్లీ చేపట్టాలని పలువురు లీడర్లు ఒత్తిడి తీసుకొచ్చినా రాహుల్ ఒప్పుకోలేదన్నాయి. పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తీర్మానాలు కూడా చేసి ఢిల్లీకి పంపారు. రాజస్థాన్, చత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, బీహార్ పీసీసీలు తీర్మానం చేశాయి.