
జనగామ అర్బన్, వెలుగు : ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్అన్నారు. మంగళవారం ఆయన జనగామ మండలం పెంబర్తి శివారులోని 106 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న మహిళ శక్తి భవనానికి అనువైన స్థలాన్ని డీఆర్డీఏ వసంత, పంచాయతీరాజ్ఈఈ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించి పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఎస్సీడీవో ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచార ఘటనలకు సంబంధించిన జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి నిర్వహించారు.
అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆ తర్వాత భూగర్భ జలాల అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులతో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. భూగర్భ జల వనరుల పరిరక్షణలో జనగామ జిల్లా ముందుందన్నారు. అధికారులు భూగర్భ జలాల స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు.