
భూపాలపల్లి రూరల్/ రేగొండ వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క పర్యటించారు. మంగళవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రూ.8.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా రేగొండకు కొత్తపల్లి ఘోరీ మండలంలోని చెన్నాపూర్ లో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గంలో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి రాగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి, ర్యాలీగా మంజూరునగర్ వచ్చారు.
గణపురం మండలం ధర్మరావుపేట, భూపాలపల్లి మండలం మంజూరునగర్, చిట్యాల మండలం నవబ్ పేట గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, టీజీ ఎన్పీడీసీఎల్సీఎండీ వరుణ్ రెడ్డి, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేటీపీ గెస్ట్ హౌస్ లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.