గంగాధర, వెలుగు: నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ర్యాలపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారు బొజ్జ సునీత తిరుపతి గృహప్రవేశానికి బుధవారం ఆయన హాజరై దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 3500 ఇండ్లను మంజూరుచేశామని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మరింత మందికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇండ్లు రాని నిరుపేదలు ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు గర్శకుర్తిలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఎమ్మెల్యే, నాయకులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్ ఆంజనేయులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ వెలిచాల తిర్మల్రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేశ్ పాల్గొన్నారు.
