హైదరాబాద్, వెలుగు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో రూ. 10,098 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.7,728 కోట్లతో పోలిస్తే 31శాతం ఎక్కువ. అయితే ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) లో వచ్చిన రూ.10,957 కోట్లతో పోలిస్తే 8శాతం తక్కువ. కంపెనీకి క్యూ2లో రూ.1,26,930 కోట్ల నెట్ ప్రీమియం ఆదాయం వచ్చింది.
ఇది కిందటేడాది క్యూ2లో వచ్చిన రూ.1,20,326 కోట్ల నుంచి 5.5శాతం పెరిగింది. ఇందులో ఫస్ట్-ఇయర్ ప్రీమియం ఆదాయం రూ.10,884 కోట్లుగా ఉంది. కానీ, ఈ ఏడాది క్యూ1లో వచ్చిన రూ.11,245 కోట్ల నుంచి తగ్గింది. ఎల్ఐసీ రెన్యూవల్ ప్రీమియం ఆదాయం క్యూ2లో రూ.65,320 కోట్లుగా, సింగిల్ ప్రీమియం ఆదాయం రూ.50,882 కోట్లుగా నమోదైంది.
ఆరు నెలల్లో..
ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్లో ఎల్ఐసీకి రూ.21,040 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది ఇదే టైమ్లో వచ్చిన రూ.18,082 కోట్లతో పోలిస్తే ఇది 16శాతం ఎక్కువ. మొత్తం ప్రీమియం ఆదాయం ఏడాది లెక్కన 5శాతం పెరిగి రూ.2,45,680 కోట్లకు చేరుకుంది. ఇందులో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.28,491 కోట్లుగా, రెన్యూవల్ ప్రీమియం ఆదాయం రూ.1,22,224 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ షేరు గురువారం ఒక శాతం తగ్గి రూ.896 దగ్గర ముగిసింది.
