వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు జరిగిన ఘటనల్లో సుమారు 22 మందికి గాయాలయ్యాయి. పట్టణంలోని మార్కెట్ ఏరియా, బద్ది పోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్ ఏరియా, దోబిఘాట్ ఏరియాల్లో కుక్కలు పాదచారులు, చిన్నారులపై దాడి చేశాయి. గాయపడిన వారిని వేములవాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు.
సమస్య తీవ్రతను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పలు వార్డుల్లో కుక్కలను పట్టుకోవడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితులను మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్పర్సన్ నారాల శేఖర్, కౌన్సిలర్ ఇప్పపూల మమత పరామర్శించారు.
