
- కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు మంత్రి సీతక్క పిలుపు
- వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వెల్లడి
మహబూబాబాద్, వెలుగు: లోకల్బాడీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా అందడం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే లోకల్ బాడీ ఎన్నికలు వీలైనంత తొందరగా నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. మండల, గ్రామ స్థాయి లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో వెనుకబడిన ములుగు నియోజకవర్గానికి అదనంగా 5 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పదేండ్లలో ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు.. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చూసి ఓర్వలేక సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అర్హులందరికీ రైతు భరోసా
అర్హులైన రైతులందరికీ వారం రోజుల్లో రైతు భరోసా డబ్బులు అందిస్తామని సీతక్క చెప్పారు. ఆకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను కూడా కొనా లని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ట్టు చెప్పారు. ఇండ్లు కట్టుకుంటున్న నిరుపేద మహిళలు డబ్బుల్లేక ఇబ్బంది పడకుండా వారికి మహిళా సంఘాల నుంచి లోన్ ఇస్తున్నట్టు తెలిపారు.
బస్సులు, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులతోపాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునేందుకు లోన్స్ ఇచ్చి.. మహిళలు వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనిని మహిళా సంఘాలకే అప్పగించామని, ఒక్కో జతకు రూ.75 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు.