
- రాష్ట్ర వాటాగా రావాల్సింది ఇచ్చేయండి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కేటాయించిన యూరియాను సరఫరా చేయటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఎరువులను తక్కువగా సరఫరా చేస్తోందని..ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాశారు.
రాష్ట్ర వాటాగా రావాల్సిన యూరియాను త్వరగా సరఫరా చేసేందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. రైతుల అవసరాల కోసం ఒక నెల ముందుగానే యూరియా నిల్వలు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదని చెప్పారు. ఈ సమస్యను గతంలో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జె.పి. నడ్డా దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.
మూడు నెలల్లో 2.25 లక్షల టన్నుల కొరత
జూన్ నెలకు కేంద్రం తెలంగాణకు 1.71 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. కేవలం 67 వేల టన్నులు మాత్రమే సరఫరా చేసినట్లు తుమ్మల వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల్లో కేటాయింపుల కంటే 1.21 లక్షల టన్నులు తక్కువగా సరఫరా జరిగిందన్నారు. మొత్తంగా మూడు నెలల్లో 2.25 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత యూరియా లభ్యత, కేంద్రం నుంచి రావాల్సిన సరఫరా వివరాలను లేఖలో వివరించామన్నారు. కొరత వల్ల ఎరువులు ఎక్కువగా అవసరమయ్యే పంటల సాగు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి, రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాను పూర్తి చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.