V6 News

ప్రజల అభీష్టం మేరకు ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల అభీష్టం మేరకు ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అమీన్​పూర్​లో ఎస్టీపీని (సీవరేజ్​ట్రీట్​మెంట్ ప్లాంట్) ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని 993 సర్వేనంబర్​ పరిధిలో ఎస్టీపీ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్​ 2.0 పథకంలో భాగంగా పటాన్​చెరు నియోజకవర్గం పరిధిలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నదన్నారు. సర్వేనంబర్​993 లో పదెకరాల్లో ప్లాంట్​ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇదే సర్వేనంబర్​లో ఐదెకరాల్లో స్టేడియం, పదెకరాల్లో నవోదయ విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు.

 స్టేడియానికి కేటాయించిన స్థలంలో ఎస్టీపీని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారని, దీని వల్ల చుట్టు పక్కల ఉన్న కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. స్టేడియానికి కేటాయించిన స్థలంలో కాకుండా కాలనీలకు దూరంగా పదెకరాలను కేటాయించి ఎస్టీపీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో అమీన్​పూర్​ డిప్యూటీ కమిషనర్​ జ్యోతిరెడ్డి, తహసీల్దార్​ వెంకటేశ్​, మాజీ మున్సిపల్​ కమిషనర్​ పాండురంగారెడ్డి, ఉపేందర్​రెడ్డి, గోపాల్, యూనుస్, రాములు, జగదీశ్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.