
పర్వతగిరి/ నెల్లికుదురు (కేసముద్రం)/ ధర్మసాగర్, వెలుగు: అవినీతికి చోటు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణంలో వివిధ గ్రామాలకు చెందిన 249 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారదతో కలిసి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం అన్నారంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్తో కలిసి సందర్శించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండా, బేరవాడ, రంగాపురం, మర్రితండా, సర్వపురం, నర్సింహులగూడెం, పెనుగొండ గ్రామాలకు చెందిన 84 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మంజూరు పత్రాలను అందజేశారు. పలుచోట్ల ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఖుషీలాన్స్లో, వేలేరు రైతువేదికలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అంతకుముందు ధర్మసాగర్లో బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ముప్పారంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ పీసీసీ పరిశీలకుడు వినయ్రెడ్డితో కలిసి కార్యకర్తలు, నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.