అవినీతికి చోటు లేకుండా లబ్ధిదారుల ఎంపిక

అవినీతికి చోటు లేకుండా లబ్ధిదారుల ఎంపిక

పర్వతగిరి/ నెల్లికుదురు (కేసముద్రం)/ ధర్మసాగర్, వెలుగు: ​అవినీతికి చోటు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు అన్నారు. శుక్రవారం వరంగల్​ జిల్లా పర్వతగిరి పట్టణంలో వివిధ గ్రామాలకు చెందిన 249 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు వరంగల్​ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్​ సత్యశారదతో కలిసి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం అన్నారంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్​తో కలిసి సందర్శించారు.  

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండా, బేరవాడ, రంగాపురం, మర్రితండా, సర్వపురం, నర్సింహులగూడెం, పెనుగొండ గ్రామాలకు చెందిన 84 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళీనాయక్​ మంజూరు పత్రాలను అందజేశారు. పలుచోట్ల ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండల కేంద్రంలోని ఖుషీలాన్స్​లో, వేలేరు రైతువేదికలో స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ అందజేశారు. అంతకుముందు ధర్మసాగర్​లో బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ముప్పారంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయా మండలాల కాంగ్రెస్​ పార్టీ పీసీసీ పరిశీలకుడు వినయ్​రెడ్డితో కలిసి కార్యకర్తలు, నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.