
- గ్రేటర్లో 2 వేలకు పైగా వెహికల్స్
- ఒకే చోట డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్
- స్టార్టప్ పెట్టేందుకు బెస్ట్ చాయిస్ అంటున్న హోటల్ ఇండస్ట్రీ నిపుణులు
హైదరాబాద్, వెలుగు: మొబైల్ ఫుడ్ ట్రక్స్.. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలా ఐటీ కారిడార్ ఏరియాల్లోనే ఎక్కువగా కనిపించేవి. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్కి నైట్ షిఫ్ట్ లు ఉండటంతో అర్ధరాత్రి వరకు ఆయా ఏరియాల్లో టిఫిన్లు, స్నాక్స్ను ఈ ఫుడ్ ఆన్ వీల్స్ వెహికల్స్లో ప్రిపేర్ చేసి అమ్మేవారు. కరోనాకు ముందు వరకు కేవలం ఐటీ కంపెనీల ఏరియాలకే పరిమితమైన ఈ వెహికల్స్ ఇప్పుడు సిటీ అంతటా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 500ల వరకున్న ఈ బండ్లు ప్రస్తుతం రెండువేలకు పైగా పెరిగిపోయాయి. కొత్త వెహికల్స్ సిటీలోని అన్ని ఏరియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం రాత్రివేళల్లోనే కాకుండా తెల్లవారుజామున కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వారిలో చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారు. తక్కువ రేటు, కంఫర్ట్, ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ ఉండటంతో కస్టమర్లు ఫుడ్ ట్రక్కుల వద్ద క్యూ కడుతున్నారు.
బల్దియా నుంచి పర్మిషన్ తప్పనిసరి
కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకునేవారికి ఫుడ్ బిజినెస్కి మించిన మంచి ఆప్షన్ ఉండదని హోటల్ ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. లాక్ డౌన్లో అన్ని వ్యాపారాల్లో నష్టాలొచ్చాయి, ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారు మొబైల్ ఫుడ్ ట్రక్స్ బిజినెస్లోకి వస్తున్నారని, అందుకే లాక్ డౌన్ తర్వాత వెహికల్స్ సంఖ్య పెరిగిందంటున్నారు. రెస్టారెంట్ పెట్టాలనుకుంటే రూ. లక్షల్లో పెట్టుబడి, రెంట్, మెయింటెనెన్స్, జీతాలు ఇలా చాలా రిస్క్ ఉంటుంది. మొబైల్ ఫుడ్ ట్రక్కుకి వెహికల్, చెఫ్, వర్కర్, బల్దియా నుంచి పర్మిషన్ తీసుకుంటే ఏ ఏరియాలోనైనా నడుపుకోవచ్చని వ్యాపారులు చెప్తున్నారు. ఫుడ్ ఆన్ వీల్స్ కి బల్దియా రూ.3,500తో స్పెషల్ ఫుడ్ లైసెన్స్ ఇస్తుంది. దీనికి ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవచ్చు. ఫుడ్ ట్రక్కుకి రూ.4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు.
సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు..
గతంలో మొబైల్ ఫుడ్ ట్రక్స్ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, కొన్ని చోట్ల తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేవి. వాటిల్లో టిఫిన్స్ మాత్రమే అమ్మేవారు. ప్రస్తుతం డిఫెరెంట్ ఫ్లేవర్స్ తో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ను అమ్ముతున్నారు. కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ఐడీఎల్ లేక్ , ఫిల్మ్నగర్, టోలిచౌకి, మెహిదీపట్నం, అమీర్ పేట, ఎర్రగడ్డ, అబిడ్స్, వనస్థలిపురం ఇలా అన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫుడ్ ట్రక్స్
కనిపిస్తున్నాయి.
జొన్న రొట్టెలను మస్తు తింటున్నరు
గ్రేటర్లో స్ట్రీట్ ఫుడ్, మొబైల్ ఫుడ్ కోర్టుల్లో తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో భాగంగా కొందరు చిరు వ్యాపారులు జొన్న రొట్టెలు అమ్ముతుండగా.. వాటికి మంచి డిమాండ్ ఉంటోంది. కరోనాకు ముందు జొన్న రొట్టెలు అమ్మేవారు ప్రతి కాలనీలో ఒకరిద్దరు మాత్రమే కనిపించగా.. ప్రస్తుతం ఒక్కో ఏరియాలో పదుల సంఖ్యలో బండ్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నాలుగైదు గంటల్లోనే సుమారు 2 లక్షలకు పైగా జొన్న రొట్టెలు అమ్ముడుపోతున్నాయి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం ఉండటంతో కరోనా ఎఫెక్ట్తో ఉపాధి కొల్పోయిన చాలా మంది రొట్టెల బిజినెస్ చేస్తున్నారు. ఏరియాని బట్టి ఒక్కో ప్రాంతంలో వీటి ధర రూ.10 నుంచి 15 వరకు ఉంటోంది. ఒక్కో బండిపై డైలీ 80 నుంచి 150 వరకు జొన్న రొట్టెలు అమ్ముడవుతున్నాయని, బ్యాచిలర్లు, స్టూడెంట్లు ఉండే ఏరియాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటోందని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు 25 వేల మందికిపైగా గ్రేటర్లో జొన్న రొట్టెలను అమ్ముతున్నారు.
నెల రోజుల క్రితమే స్టార్ట్ చేశా
లాక్ డౌన్తో మా రెస్టారెంట్లో బిజినెస్ సరిగా నడవకపోవడంతో నెల రోజుల క్రితమే ఫుడ్ ట్రక్ను ప్రారంభించాం. వెహికల్కు రూ.4 లక్షలు ఖర్చయ్యింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్నాక్స్, టిఫిన్స్ అమ్ముతున్నాం. జనాల నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది.
- నవీన్, వెంకటేశ్వర ఫుడ్ ట్రక్ ఓనర్, ఫిల్మ్నగర్