ఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించాలి : కలెక్టర్ దివాకర

ఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించాలి : కలెక్టర్ దివాకర

ములుగు, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో గృహ నిర్మాణ సంస్థ, ఇంజినీరింగ్ అధికారులు, 10 మండలాల అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ సెక్రటరీలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఆయన అడిషనల్​ కలెక్టర్ సంపత్ రావుతో కలసి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై గ్రామాల వారీగా ఆరా తీశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదటి విడతలో చేపట్టిన ఇండ్లను అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు డబ్బులు వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా నిర్మూలించేందుకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఏఈలు ఇసుక టోకెన్ల జారీని చేపట్టాలన్నారు.