మరో 27 మిల్లులకు వడ్లు కేటాయించినా.. ముందుకుపడని కొనుగోళ్లు

మరో 27 మిల్లులకు వడ్లు కేటాయించినా.. ముందుకుపడని కొనుగోళ్లు
  • అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం
  • రైతుల దగ్గరే 85 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. సీఎంఆర్​ పెండింగ్​ కారణంగా మొదట్లో 13 మిల్లులకు మాత్రమే వడ్లు కేటాయించాలని నిర్ణయించిన ఆఫీసర్లు, ఆ తరువాత మరో 27 మిల్లులకు వడ్లు కేటాయించారు. అయినప్పటికీ వడ్ల కొనుగోళ్లు ముందుకుపడడం లేదు. ఈ సీజన్​లో 1.89 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వాటిని కొనుగోలు చేసేందుకు 234 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, రైతుల వద్ద ఇంకా 85 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు ఉన్నాయి. 

అకాల వర్షాలతో ఆందోళన..

ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లు, మార్కెట్​ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు వర్షాలకు కొట్టుకుపోతున్నాయని, వారం రోజులు కష్టపడి ఆరబెట్టిన వడ్లు ఒక్క వర్షానికే తడిసిపోతున్నా యని వాపోతున్నారు. తేమ, తాలు, తడిసిన ధాన్యం అంటూ మిల్లర్లు కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదనంగా మిల్లులకు వడ్లు కేటాయించినా..

జిల్లాలో 137 రైస్​ మిల్లులు ఉండగా, సీఎంఆర్​ బకాయిల కారణంగా 75 మిల్లులను డిఫాల్టర్​ లిస్ట్​లో చేర్చారు. 50 శాతానికి పైగా సీఎంఆర్​ క్లియర్ చేసిన 51 మిల్లులకు ధాన్యం కేటాయించడానికి సివిల్​ సప్లై ఆఫీసర్లు ముందుకు వచ్చినా, 100 శాతం బ్యాంక్​ గ్యారెంటీ, అండర్​ టేకింగ్​ నిబంధనలతో చాలా మంది మిల్లర్లు వడ్లు తీసుకునేందుకు అర్హత సాధించలేదు. దీంతో సీజన్​ ప్రారంభంలో 13 మిల్లులకు మాత్రమే వడ్లు కేటాయించారు. వర్షాల కారణంగా వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆందోళనలు చేయడంతో, సివిల్​ సప్లై కమిషనరేట్​ పరిస్థితులను బట్టి వడ్లు కేటాయించే అధికారాన్ని కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్​కు కట్టబెట్టింది. 

డిఫాల్టర్ల జాబితాలో ఉన్న మిల్లర్ల నుంచి  కొంత నగదు గ్యారెంటీ, అండర్​ టేకింగ్  తీసుకుని వడ్లు కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా చిన్న మిల్లర్ల నుంచి రూ.10 లక్షలు, పారాబాయిల్డ్​ మిల్లర్ల నుంచి రూ.50 లక్షల వరకు గ్యారెంటీ తీసుకొని వడ్లు కేటాయిస్తున్నారు. ఇటీవల మరో 27 మిల్లులకు వడ్లు కేటాయించాలని నిర్ణయించారు. చిన్న మిల్లులకు సన్న వడ్లు, పారాబాయిల్డ్​ మిల్లులకు దొడ్డు వడ్లు కేటాయించారు.

కలెక్టర్​ ఆదేశించినా..

కొనుగోలు కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని, వడ్లు తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ బదావత్​ సంతోష్​సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్కెట్​ యార్డుల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలోనూ టార్పాలిన్​  కవర్లు, పాలిథిన్  షీట్లు అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్​పోర్ట్  టెండర్​ ఖరారు కాలేదు. వరి సాగు పెరిగిందని వ్యవసాయ అధికారులు ముందుగానే దిగుబడి లెక్కలు ఇచ్చినా  అందుకు తగినట్లు గన్నీ బ్యాగులు, టార్పాలిన్,​ పాలిథిన్​ కవర్లు, వడ్లు తూర్పార పట్టే మెషీన్లు సమకూర్చుకోలేదు.

 దీంతో పాటు ప్రతి సెంటర్​లో తరుగు పేరుతో కోతలు పెడుతున్నారని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈక్రమంలో తడిసిన వడ్లను మిల్లుల్లో అమ్ముకుంటున్నారు. మిల్లర్లు తమ వద్దకు నేరుగా వచ్చిన వడ్లను తేమ,తాలు పంచాయితీ లేకుండా క్వింటాల్​కు రూ.1,700 వరకు ఇచ్చి కొంటున్నారు. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు నైరుతి రుతుపవనాలు వస్తున్నాయనే సమాచారంతో మెజార్టీ రైతులు ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లను అమ్ముకుంటున్నారు.