ఫలించిన 16 ఏండ్ల నిరీక్షణ.. 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టిన నవీన్ యాదవ్

ఫలించిన 16 ఏండ్ల నిరీక్షణ.. 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టిన నవీన్ యాదవ్
  • 2023లో కాంగ్రెస్​లో చేరిక
  • జనంలో ఉంటూ, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా జయకేతనం

హైదరాబాద్, వెలుగు: దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్​ యాదవ్​.. తన కలను సాకారం చేసుకున్నారు. జూబ్లీహిల్స్​ గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచి.. అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. రాజకీయాల్లోకి ఆయన 2009లో అడుగుపెట్టారు. ఎంఐఎంలో ప్రస్తానం ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2023 నవంబర్​లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్​ బైపోల్​లో విజయకేతనం ఎగురవేశారు. 

వ్యక్తిగత జీవితం: హైదరాబాద్​లోని యూసుఫ్​గూడలో 1983లో నవీన్​ యాదవ్​ జన్మించారు. పూర్తి పేరు వల్లాల నవీన్​ యాదవ్. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్​. నవీన్​ యాదవ్​ వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్​. భార్య వర్ష,  కుమారుడు అన్ష్.

2023లో కాంగ్రెస్​లో చేరిక

2023 నవంబర్​ 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సమక్షంలో నవీన్​ యాదవ్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకుంటూ.. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను చేయించారు. సిట్టింగ్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ మృతితో జూబ్లీహిల్స్​లో బైపోల్​ జరిగింది.  ఇందులో కాంగ్రెస్​ అధిష్ఠానం.. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నవీన్ ​యాదవ్​కు టికెట్​ ఇచ్చింది. అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ కాంగ్రెస్​ జెండాను ఆయన ఎగురవేశారు. 24,729  ఓట్ల భారీ  మెజారిటీతో గెలిచి జూబ్లీహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గ రికార్డ్​ బ్రేక్​ చేశారు. 

రాజకీయ ప్రస్తానం: 2009లో యూసుఫ్​గూడ డివిజన్​లో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్​గా నవీన్​ యాదవ్​ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్​ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆయన  41,656 ఓట్లు (25.19 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్​నగర్​ డివిజన్​ నుంచి కార్పొరేటర్​గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆయన 18,817 ఓట్లు సాధించారు.