వడ్ల కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆందోళన

వడ్ల కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆందోళన
  • డీజిల్​ బాటిల్​తో బీజేపీ నేత హల్​చల్
  • సిరికొండలో బీఆర్​ఎస్​ నేతల ధర్నా 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో యాసంగి వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం ఇందల్వాయి–ధర్పల్లి మెయిన్ ​రోడ్​పై ఎల్లారెడ్డిపల్లి రైతులు ధర్నా చేపట్టారు. పది రోజుల నుంచి కాంటా కోసం వడ్ల బస్తాలతో ఎండలో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. రోడ్డుపై వంటావార్పునకు రెడీ అయ్యారు. ఇంతలో అక్కడికి డీజిల్​ బాటిల్​తో వచ్చిన ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్​మఠంల సుజాత భర్త, బీజేపీ నేత మఠంల శేఖర్ ​హల్​చల్​ చేశారు. డీజిల్​ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారించి పక్కకు తీసుకెళ్లారు. రైతులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. 

తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్​ఎస్​ నేతలు

వడ్ల కొనుగోళ్లలో జాప్యానికి నిరసనగా సిరికొండలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్​ నేతలు  ధర్నా చేశారు. దొడ్డు రకం వడ్లు అన్​లోడ్​ చేసుకోడానికి జిల్లాలోని మిల్లర్లు ఒప్పుకోకపోవడంతో  కొనుగోలు సెంటర్లలో కొనడంలేదు. వడ్లను వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చాలని బీఆర్​ఎస్​ నేతలు కిషన్, గడ్గోల్​ భూమారెడ్డి నేతృత్వంలో ధర్నా చేశారు.