పెట్రోల్ బంకుల్లో రూల్స్ బేఖాతర్.. కనిపించని ఎయిర్ చెక్, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ సేవలు

పెట్రోల్ బంకుల్లో రూల్స్ బేఖాతర్..  కనిపించని ఎయిర్ చెక్, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ సేవలు
  • పట్టించుకోని సివిల్ సప్లయ్ అధికారులు

నిజామాబాద్, వెలుగు :జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో నిబంధనలను ఉల్లఘిస్తున్నారు. పెట్రోల్, డీజిల్​ వ్యాపారానికి ఇస్తున్న ప్రాధాన్యత కనీస అవసరాలకు ఇవ్వడం లేదు.  తరచూ తనిఖీలు చేయాల్సిన సివిల్​ సప్లయ్ అధికారులు అటువైపు తొంగిచూడడం లేదు. బంక్​లో పొందాల్సిన సేవలపై పౌరులకు అవగాహనలేకపోవడంతో బంక్​యజమానులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బండ్లకు ఎయిర్​ చెక్​తోపాటు ఇతర 15 రకాల సేవలను బంకుల్లో అందించాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

మొత్తం 221 బంక్​లు..

జిల్లాలో 3,90,126 టూ వీలర్స్ వెహికల్స్, ఫోర్​ వీలర్లు 47,122, ఆటో రిక్షాలు ఇతర త్రీ వీలర్​ వెహికల్స్​ 31 వేలు, స్కూల్ బస్సులు 776, లారీలు, టిప్పర్లు కలిపి 1600, జేసీబీలు, ప్రొక్లెయిన్​లు వంద దాకా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ఆయిల్​ కంపెనీలకు చెందిన 221పెట్రోల్, డీజిల్ బంక్స్​ ఉన్నాయి.  నిత్యం సుమారు రూ.కోటి 10 లక్షల వరకు సేల్స్​ అవుతున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు పరిమితం కాకుండా 15 రకాల సేవలు అందించాల్సి ఉంది.

 బంక్​ల్లో ఉచితంగా ఎయిర్​ చెక్​ చేయడంతోపాటు  క్లీన్ టాయిలెట్స్, ఫస్ట్​ ఎయిడ్ బాక్స్​, తాగునీరు పెట్టాలి. వీటితోపాటు కంప్లెయింట్ అండ్ సజేషన్ బాక్స్, పని వేళలు తెలిపే బోర్డు, అగ్ని ప్రమాద పరికరాలు, ఇసుక నింపిన బకెట్లు, ధరల పట్టిక, ఇంధనం కొలత పరికరాలు, ఎమర్జెన్సీ కాల్ నంబర్ వంటివి బంక్​లోకి ఎంటర్​ కాగానే కనబడేలా ఏర్పాటు చేయాలి.  ప్రతి బంక్​లో ఆయిల్​ కంపెనీకి చెందిన లోకల్ ఆఫీసర్​ పేరు వారి ఫోన్ నంబర్​ వినియోగదారులకు కనబడేట్లు విధిగా పెట్టాలి. 

ఏ బండిని ట్యాంక్ ఫుల్ చేయొద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి.  అయితే వీటిలో ధరల పట్టిక, నో స్మోకింగ్, నో సెల్​ఫోన్, ఇంజిన్​ ఆపు చేయండి వంటి సూచికలు పెట్టి మిగతా సేవల జోలికి  వెళ్లడం లేదు. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓపెన్ చేసిన పది బంకు​ల్లో మాత్రం కస్టమర్లను ఆకర్శించడానికి ఎయిర్ చెక్​ కొనసాగిస్తున్న మేనేజ్​మెంట్​లు మిగతా సర్వీస్​లను పట్టించుకోవడంలేదు.  

ఉత్సవ విగ్రహాల్లా ఎయిర్​ మిషన్లు.. 

తనిఖీ ఆఫీసర్లకు కనబడేలా బంక్​లో ఒక మూలకు ఎయిర్​ చెక్​ మిషన్ పెట్టి సర్వీస్ చేయడం లేదు. కస్టమర్లు ఎప్పుడు ప్రశ్నించినా రిపేర్​లో ఉందని దాటవేస్తున్నారు.  కొన్ని బంకుల పక్కన తెలివిగా ప్రైవేట్ పక్చర్ షాప్​లు రన్​ చేయిస్తున్నారు.  ​లైసెన్స్​లు పొందడానికి ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కస్టమర్లకు అందుబాటులో ఉండడం లేదు.

 మండలాల్లో అయితే వాటికి తాళాలు వేసేశారు. ఫుయల్​ కొలతలపై అనుమానం వచ్చినప్పుడు నిలదీస్తున్న వినియోగదారులు అసలు తాము పొందాల్సిన సర్వీస్​లపై అవగాహన పొందడం లేదు.  తనిఖీలతో పరిష్కరించాల్సిన ఆఫీసర్లు మామూళ్లతో సైలెంట్ అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

లోపాలు సెట్​ చేస్తం..

వడ్ల కొనుగోళ్లు ఇతర అంశాల బిజీ కారణంగా ఫ్యూయల్ బంకులను తనిఖీ చేయలేకపోయాం.  రెగ్యులర్ తనిఖీలతో లోపాలు లేకుండా చూస్తాం. నిబంధనలు పాటించని బంక్ నిర్వాహకులపై చర్యలు​ తీసుకుంటాం. సేవా లోపాలపై పౌరులు తమకు ఫిర్యాదు చేయొచ్చు.- అరవింద్​రెడ్డి, డీఎస్​వో