
- పట్టించుకోని సివిల్ సప్లయ్ అధికారులు
నిజామాబాద్, వెలుగు :జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో నిబంధనలను ఉల్లఘిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వ్యాపారానికి ఇస్తున్న ప్రాధాన్యత కనీస అవసరాలకు ఇవ్వడం లేదు. తరచూ తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ అధికారులు అటువైపు తొంగిచూడడం లేదు. బంక్లో పొందాల్సిన సేవలపై పౌరులకు అవగాహనలేకపోవడంతో బంక్యజమానులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బండ్లకు ఎయిర్ చెక్తోపాటు ఇతర 15 రకాల సేవలను బంకుల్లో అందించాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
మొత్తం 221 బంక్లు..
జిల్లాలో 3,90,126 టూ వీలర్స్ వెహికల్స్, ఫోర్ వీలర్లు 47,122, ఆటో రిక్షాలు ఇతర త్రీ వీలర్ వెహికల్స్ 31 వేలు, స్కూల్ బస్సులు 776, లారీలు, టిప్పర్లు కలిపి 1600, జేసీబీలు, ప్రొక్లెయిన్లు వంద దాకా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ఆయిల్ కంపెనీలకు చెందిన 221పెట్రోల్, డీజిల్ బంక్స్ ఉన్నాయి. నిత్యం సుమారు రూ.కోటి 10 లక్షల వరకు సేల్స్ అవుతున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు పరిమితం కాకుండా 15 రకాల సేవలు అందించాల్సి ఉంది.
బంక్ల్లో ఉచితంగా ఎయిర్ చెక్ చేయడంతోపాటు క్లీన్ టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాగునీరు పెట్టాలి. వీటితోపాటు కంప్లెయింట్ అండ్ సజేషన్ బాక్స్, పని వేళలు తెలిపే బోర్డు, అగ్ని ప్రమాద పరికరాలు, ఇసుక నింపిన బకెట్లు, ధరల పట్టిక, ఇంధనం కొలత పరికరాలు, ఎమర్జెన్సీ కాల్ నంబర్ వంటివి బంక్లోకి ఎంటర్ కాగానే కనబడేలా ఏర్పాటు చేయాలి. ప్రతి బంక్లో ఆయిల్ కంపెనీకి చెందిన లోకల్ ఆఫీసర్ పేరు వారి ఫోన్ నంబర్ వినియోగదారులకు కనబడేట్లు విధిగా పెట్టాలి.
ఏ బండిని ట్యాంక్ ఫుల్ చేయొద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. అయితే వీటిలో ధరల పట్టిక, నో స్మోకింగ్, నో సెల్ఫోన్, ఇంజిన్ ఆపు చేయండి వంటి సూచికలు పెట్టి మిగతా సేవల జోలికి వెళ్లడం లేదు. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓపెన్ చేసిన పది బంకుల్లో మాత్రం కస్టమర్లను ఆకర్శించడానికి ఎయిర్ చెక్ కొనసాగిస్తున్న మేనేజ్మెంట్లు మిగతా సర్వీస్లను పట్టించుకోవడంలేదు.
ఉత్సవ విగ్రహాల్లా ఎయిర్ మిషన్లు..
తనిఖీ ఆఫీసర్లకు కనబడేలా బంక్లో ఒక మూలకు ఎయిర్ చెక్ మిషన్ పెట్టి సర్వీస్ చేయడం లేదు. కస్టమర్లు ఎప్పుడు ప్రశ్నించినా రిపేర్లో ఉందని దాటవేస్తున్నారు. కొన్ని బంకుల పక్కన తెలివిగా ప్రైవేట్ పక్చర్ షాప్లు రన్ చేయిస్తున్నారు. లైసెన్స్లు పొందడానికి ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కస్టమర్లకు అందుబాటులో ఉండడం లేదు.
మండలాల్లో అయితే వాటికి తాళాలు వేసేశారు. ఫుయల్ కొలతలపై అనుమానం వచ్చినప్పుడు నిలదీస్తున్న వినియోగదారులు అసలు తాము పొందాల్సిన సర్వీస్లపై అవగాహన పొందడం లేదు. తనిఖీలతో పరిష్కరించాల్సిన ఆఫీసర్లు మామూళ్లతో సైలెంట్ అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
లోపాలు సెట్ చేస్తం..
వడ్ల కొనుగోళ్లు ఇతర అంశాల బిజీ కారణంగా ఫ్యూయల్ బంకులను తనిఖీ చేయలేకపోయాం. రెగ్యులర్ తనిఖీలతో లోపాలు లేకుండా చూస్తాం. నిబంధనలు పాటించని బంక్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సేవా లోపాలపై పౌరులు తమకు ఫిర్యాదు చేయొచ్చు.- అరవింద్రెడ్డి, డీఎస్వో