
- హుజూరాబాద్ సెంట్రిక్గా సోషల్ మీడియాలో తప్పుడు రాతలు
- మార్ఫింగ్ ఫొటోలు, ఫేక్ వీడియోలు వైరల్
- ఎన్నికల కమిషన్నూ కించపరిచేలా పోస్టులు
- ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటున్న ప్రతిపక్షాలు
హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఫేక్ న్యూస్ ప్రచారంఅగ్గి రాజేస్తోంది. సోషల్ మీడియాలో పూటకో తప్పుడు పోస్టు వైరల్ అవుతోంది. ఒక్కో ఫేక్ పోస్టు మూడు నాలుగు రోజులు రాష్ట్రమంతటా గిరికీలు కొడుతోంది. దీనికి వివరణలు.. కౌంటర్లు.. ఇచ్చుకునేందుకు లీడర్లు సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగుతున్నారు. ఫేక్ న్యూస్ వైరల్ అవడంతో అసలు నిజమేమిటో తెలియక జనం గందరగోళానికి గురవుతున్నారు.
హద్దులు మీరుతున్న టీమ్లు
ఎన్నికల ప్రచార సరళిలో సోషల్ మీడియా కీలకంగా మారడంతో పొలిటికల్ పార్టీలు భారీగా సోషల్ మీడియా టీమ్లను ఏర్పాటు చేసుకున్నాయి. తమ పార్టీని గెలిపించేందుకు ఎంతైనా బరితెగిస్తామన్నట్లు కొన్ని టీమ్లు హద్దులు మీరుతున్నాయి. ఫేక్ న్యూస్ను, మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేయడంపైనే ఫోకస్ చేస్తున్నాయి. ప్రత్యర్థిపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటున్నాయి. అధికార పార్టీ ఏకంగా హుజూరాబాద్లో ఫంక్షన్ హాళ్లను రెంట్కు తీసుకొని, వందల మంది సోషల్ మీడియా టీమ్ సభ్యులకు మకాం ఏర్పాటు చేసింది. ‘ఉచిత భోజన వసతి కల్పిస్తాం..’ అంటూ యూట్యూబ్, డిజిటల్ మీడియా టీమ్లకు హుజూరాబాద్ లీడర్లు ఓపెన్గా ఆహ్వానం పలుకుతున్న తీరు వాట్సాప్ గ్రూపుల్లో చర్చనీయాంశంగా మారింది.
దళిత బంధుపై..
ఈటల లేఖ వల్లే దళితబంధు ఆగిందంటూ టీఆర్ఎస్ విష ప్రచారం చేసింది. దళిత బంధు ఆపడానికి ఈటల కారణమని ఎంపీ అర్వింద్ చెప్పినట్లు మరో ఫేక్ వీడియో వైరలైంది. తమను బద్నాం చేసే కుట్రలను అడ్డుకో వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
బల్మూరి బాధలో ఉన్నట్లు
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్పై ఒక ఫేక్ న్యూస్ క్లిప్ వైరల్ అవుతోంది. ఈటల, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని, తనను బలి పశువును చేశారంటూ బల్మూరి వెంకట్ ఆవేదనలో ఉన్నట్లు ఒక తప్పుడు క్లిప్పింగ్ను టీఆర్ఎస్ గ్రూపులు వైరల్ చేశాయి.