- జైళ్ల డీజీ రాజీవ్ త్రివేది వినూత్న ఆలోచన
- హోరాహోరీ మ్యాచ్లో పోలీసుల విజయం
హైదరాబాద్, వెలుగు: ఏండ్లుగా జైళ్లలో ఉంటూ, కరోనా కాలంలో ములాఖత్లు లేక మనోవేదనకు గురవుతున్న ఖైదీల కోసం అధికారులు కొత్తగా ఆలోచించారు. వారిని మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు పోలీసులు, ఖైదీల మధ్య వాలీబాల్ మ్యాచ్ పెట్టారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో శుక్రవారం జరిగిన వాలీబాల్ మ్యాచ్ ఖైదీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
జైళ్ల డీజీ ఆలోచనతో..
జైళ్లలో ప్లేయర్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జైళ్ల డీజీ రాజీవ్ త్రివేది ప్లాన్ చేశారు. చంచల్గూడ, చర్లపల్లి, వరంగల్ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న 12 మంది ఖైదీలను వాలీబాల్ మ్యాచ్ల కోసం ఎంపిక చేశారు. వారికి నేషనల్ వాలీబాల్ కోచ్ జంపయ్య గౌడ్తో గతేడాది నుంచి కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ టీమ్తో చంచల్గూడ జైలు లోపల ఉన్న గ్రౌండ్లో మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో ప్రిజన్స్ టీమ్కి జీవిత ఖైదీ ఖాదర్ వలీ కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రిజన్స్ టీమ్ ప్రతీ రౌండ్లో పోలీస్ టీమ్తో గట్టి పోటీ ఇచ్చింది. మొదటి రెండు రౌండ్స్ పోలీస్ టీమ్ పాయింట్స్ సాధించింది. మూడో రౌండ్లో ఖైదీలు ప్రతిభ చూపారు. మ్యాచ్లో పోలీస్ స్పోర్ట్స్ టీమ్ విజయం సాధించింది. విజేతలను, ప్రతిభ కనబరిచిన ఖైదీలకు డీజీ రాజీవ్ త్రివేది, పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అవార్డులు అందజేశారు. మ్యాచ్ చూసేందుకు ఖైదీల కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఖైదీలు తోటీ ఖైదీలను ఎంకరేజ్ చేశారు. దీంతో చంచల్గూడ జైలు పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి.
‘‘ఖైదీల్లో మార్పు తేచ్చేందుకే ఫ్రెండ్లీ మ్యాచ్లు ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ మెంబర్స్ను కలిసేందుకు అవకాశం కలిగించాం. మా ప్రిజన్స్ టీమ్లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు కృషి చేస్తున్నాం. పోలీస్ స్పోర్ట్స్ టీమ్తో సమానంగా వాలీబాల్ మ్యాచ్లో ప్రతిభచూపారు’’ - రాజీవ్ త్రివేది, జైళ్ల డీజీ
‘‘మాది మహబూబ్నగర్. బీకాం చదివా. పంజాగుట్టలో నెట్వర్క్ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేవాణ్ని. చెడు దోస్తానీతో ఓ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నా. జీవిత ఖైదు పడింది. 2013 అక్టోబర్ నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నా. మా ఫ్యామిలీలో నేను ఒక్కడినే కొడుకుని. నాన్నను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ - మహ్మద్ యాకుబ్, చంచల్గూడ
‘‘మాది ఆసిఫాబాద్ జిల్లా. ఓ హత్య కేసులో లైఫ్ పడింది. 2018 సెప్టెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నా. అమ్మనాన్న వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. వాలీబాల్ లాంటి గేమ్స్ వల్ల మానసిక వేదనకు దూరమవుతున్నాం’’ - శ్రీను యాదవ్, చంచల్గూడ