కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌వి రైతు వ్యతిరేక విధానాలు : జాన్ వెస్లీ

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌వి రైతు వ్యతిరేక విధానాలు : జాన్ వెస్లీ
  • పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి: జాన్ వెస్లీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఇథనాలు ఫ్యాక్టరీ, భూ భారతిలో తప్పిదాలను ప్రశ్నించిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అవమానకరంగా చూస్తోందని మండిపడ్డారు. త్వరలో రైతుల నుంచి సీఎం రేవంత్ సర్కార్ గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని సుర్జీత్ భవన్ వేదికగా జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని నిరసన తెలుపుతున్న రైతులను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఇందులో భాగంగా 60 మంది రైతులపై కేసులు పెట్టారని, 12 మందిని రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారని చెప్పారు. 

ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌‌‌‌‌‌‌‌లోనూ భూ భారతిపై సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఓ రైతును అవమానకరంగా నెట్టివేశారన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగానికి విద్యను దూరం చేసి, ప్రైవేట్ రంగానికి చదువును వ్యాపారంగా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో గ్రామాల్లో, ఆదివాసీ ఏరియాల్లో స్కూళ్లు మూతపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 12 గురుకుల స్కూళ్లను కూడా ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద వర్గాలు విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.