
తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు, ఒక ద్రోని కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. జూన్ 14 తో పాటు వచ్చే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 14న అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ కామారెడ్డి, మెదక్ ,సంగారెడ్డి, వికారాబాద్ ,మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉంటుందని తెలిపింది.
జూన్ 14 న అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశంఉంది. అక్కడక్కడ పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని , త్వరలో భారతదేశం అంతా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
రాష్ట్రంలోకి త్వరగా నైరుతి రుతుపవనాలు వచ్చినా.. ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 32.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. ఇప్పటివరకూ కేవలం 25 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైందని పేర్కొంది. మొత్తంగా 4 జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం, 3 జిల్లాల్లో అధిక వర్షపాతం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డ్ అయినట్టు వెల్లడించింది. 11 జిల్లాల్లో భారీ లోటు నమోదైందని తెలిపింది. మరో 13 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయిందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం తక్కువ వర్షాలు పడ్డాయని పేర్కొంది. అయితే, ఇప్పటి నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 19 నాటికి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం, 20 నుంచి 26 మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది.