
‘పెళ్లి పుస్తకం’నుంచి ‘షష్టిపూర్తి’వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ తనకు దక్కిందని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన ‘షష్టిపూర్తి’చిత్రం ఇటీవల విడుదల కాగా, దీనికి మంచి ఆదరణ దక్కుతోందని టీమ్ చెప్పింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఇది కల్చరల్ బ్లాక్ బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్ బస్టర్. థియేటర్స్లో అందరూ చూసి ఏడ్చేస్తున్నారంటేనే మేం సక్సెస్ అయినట్టు. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు పవన్ ప్రభ. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’అని అన్నారు.
హీరో, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ ‘ఈ మూవీని థియేటర్లో చూస్తేనే మంచి ఫీలింగ్ వస్తుంది. ఇళయరాజా గారి మ్యూజిక్, తోట తరణి గారి సెట్స్ను బిగ్ స్క్రీన్లోనే చూడాలి. కొత్త వారు చేసిన పాత్రల్ని కూడా ఆడియెన్స్ గుర్తు పెట్టుకుంటున్నారు’ అని చెప్పాడు. తమ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని, మౌత్ టాక్తో మరింత ముందుకు వెళ్తోందని దర్శకుడు పవన్ ప్రభ చెప్పాడు. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్, కెమెరామెన్ రామ్ మాట్లాడారు.