ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలాగే ఉంటది: టూరిస్టులకు చుక్కలు చూపించిన రైనో

ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలాగే ఉంటది: టూరిస్టులకు చుక్కలు చూపించిన రైనో

దిస్‎పూర్: ఖడ్గమృగాలకు ఫేమస్ అయిన అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరదాగా నేషనల్ పార్క్‎ చూద్దామని వచ్చిన పర్యాటకులకు ఖడ్గమృగం పట్టపగలే చుక్కలు చూపించింది. దీంతో ఉద్యానవనం అందాలు చూడటమేమో కానీ.. ఎక్కడ ప్రాణాలు పోతాయోనని టూరిస్టులు భయంతో గజగజ వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. 

అసలు ఏం జరిగిందంటే..?

గురువారం (మే 29) అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‎ను వీక్షించడానికి కొందరు టూరిస్టులు వెళ్లారు. వీరంతా సఫారీ జీపుల్లో తిరుగుతూ ఉద్యానవన అందాలను తిలకించడంతో పాటు పార్కులోని జంతువులను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో టూరిస్టులు ఉన్న సఫారీ జీపు దగ్గరికి ఓ ఖడ్గమృగం దూసుకొచ్చింది. ఏమైందో తెలియదు కానీ.. టూరిస్టుల సఫారీ జీపుపై దాడి చేసింది. తన కొమ్ములతో జీపును బోల్తో పడేసేందుకు పలుమార్లు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో సఫారీ జీపు కుదుపునకు లోను కావడంతో దానిలోని టూరిస్టులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

ఈ క్రమంలో వెనక జీపులో ఉన్న పర్యాటకులు పెద్దగా అరవడంతో ఖడ్గమృగం భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఊహించని పరిణామంతో టూరిస్టులు షాక్‎కు గురయ్యారు. ఖడ్గమృగం తమపై దాడి చేయకుండా వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పర్యాటకుల సఫారీ జీపుపై రైనో దాడి చేసిన దృశ్యాలను వెనక ఉన్నవారు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

►ALSO READ | కృత్రిమ రక్తం తయారు చేస్తున్న దేశం:2030 నాటికి మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు..!

అమ్మా జర్రుంటే చచ్చిపోదుమురా అని కొందరు.. ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలాగే ఉంటదని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కజిరంగా నేషనల్ పార్కులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. 2025 జనవరిలో కూడా ఓ మహిళ ఆమె కుమార్తెపైన రైనో దాడికి ప్రయత్నించగా.. వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.