
- పూలు, మామిడాకులు, ముగ్గులతో పాఠశాలల అలంకరణ
- ఏళ్లుగా మూతపడి.. ఇప్పుడు తెరుచుకున్న స్కూళ్లు
కరీంనగర్, వెలుగు: విద్యాసంవత్సరం ఆరంభం అదిరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. మామిడి ఆకులు, పూలతో స్కూళ్లను అలంకరించారు. స్కూళ్ల ముందు ముగ్గులు వేశారు. సమ్మర్ హాలీడేస్ తర్వాత కొత్త తరగతిలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు పూలు ఇచ్చి ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. అంతేగాక ఇప్పటికే సిద్ధంగా ఉంచిన బుక్స్, యూనిఫామ్స్ మొదటిరోజే పంపిణీ చేశారు.
కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ జడ్పీ హైస్కూల్ పున:ప్రారంభం సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలతో ఇంటికి సమీపంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు.
ఏళ్లుగా మూతపడి.. ఇప్పుడు తెరుచుకుంటున్న స్కూళ్లు..
హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఏడేళ్లుగా మూడపడి ఉంది. ఈ భవనాన్ని జీపీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్ కు పంపించడానికి ఆసక్తి చూపడంతో ప్రభుత్వ ఆదేశాలతో పున:ప్రారంభించినట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. మొదటి రోజు 12 మంది చిన్నారులు స్కూల్ కు వచ్చారు.
కోరుట్ల: కోరుట్ల మండలం యూసుఫ్నగర్ స్కూల్లో, కథలాపూర్ మండలం సిరికొండ స్కూల్లో ఎంఈవోలు నరేశం, శ్రీనివాస్ బుక్స్, యూనిఫామ్ అందజేశారు.
మల్యాల మండలంలో రెండు స్కూళ్లు రీ ఓపెన్
మల్యాల, వెలుగు: గతేడాది జీరో అటెండెన్స్ కారణంగా మూతపడ్డ మల్యాల మండలం రాంపూర్ వడ్డెర కాలనీ, కొంపల్లె ప్రాథమిక పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి. బడిబాట ప్రోగ్రాంలో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాంపూర్ వడ్డెర కాలనీ పాఠశాలలో 15 మంది, కొంపల్లిలో 7 గురు స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకుని, పాఠశాలలకు హాజరైనట్లు ఎంఈవో జయసింహారావు తెలిపారు.