- వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్లో భారతదేశం
ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో మాత్రమే ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణ కొరియా, చైనా, నెదర్లాండ్స్ మొదలగు దేశాలు భారతదేశం కంటే ముందు వరుసలో ఉన్నాయి. నిర్దిష్టమైన ఉద్యోగానికి లేదా పనికి అవసరమయ్యే విద్య, కంప్యూటర్ కోడింగ్, ఎలక్ట్రికల్ పనులు, వ్యవసాయేతర రంగాలలో పట్టు, నర్సింగ్ వంటి వృత్తి లేదా సాంకేతిక నైపుణ్యాలు, అదేవిధంగా సమర్థవంతమైన కమ్యూనికేషన్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సహచర బృందంతో కలిసి పనిచేయడం, ఒత్తిడిని తట్టుకునే గుణం మొదలగు సామాజిక లేదా వ్యక్తిగత నైపుణ్యాలు చాలా అవసరం.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమం అమలుచేస్తున్నది. పీఎం -సేతు ద్వారా పరిశ్రమల సహకారంతో (ఐటిఐలు)ను ఆధునికీకరించాలనే లక్ష్యంతో రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నైపుణ్య కార్యక్రమాలు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహక పథకం ద్వారా ఉద్యోగ శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందించి వారు నేర్చుకుంటూ సంపాదించేలా ఉపకార వేతనాలు మంజూరు చేసి యువత శిక్షణకు కేంద్రం ప్రోత్సహిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నైపుణ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అట్టడుగు వర్గాలలో అర్హులైన నిరుద్యోగ యువతకు మూడు లక్షల వరకు రాయితీ రుణాలు అందిస్తోంది. ఇది చిన్న తరహా వ్యాపార సంస్థను స్థాపించడానికి ఉపయోగపడుతుంది. స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా 14 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గల యువతకు పరిశ్రమలకు అవసరమైన శిక్షణ, డిజిటల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు విద్యార్థులకు స్కిల్స్ కోసం విద్యపై దృష్టి పెడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.
నైపుణ్యాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు
గత దశాబ్ద కాలంలో భారతదేశంలో వివిధ రంగాలలో నైపుణ్యాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు దాదాపుగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే 2016 –-17 ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యాల అభివృద్ధికి / స్కిల్ డెవలప్మెంట్కు సుమారు రూ.2000 కోట్లు, 2026 -–27 బడ్జెట్లో రూ. 9,885 కోట్లు కేటాయించారు. అంటే ప్రతి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నైపుణ్య అభివృద్ధికి కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ దీనిద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి, ఎంతమంది యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు అనేది చర్చించుకోవాలి. గత పుష్కర కాలంలో (2014-– 2026) కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 6 కోట్ల యువతకు శిక్షణ ఇచ్చింది. ఇది ఉపాధి కల్పనలో కొంతవరకు మెరుగుదల సాధించాయి అని విశ్లేషణలు చెబుతున్నప్పటికీ, భారతదేశంలో 37 కోట్ల యువ జనాభా ఉంది. గణాంకాల ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువ. ఇంకా ఎక్కువమందికి వివిధ నైపుణ్యాలను మెరుగుపరచడంలో శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది.
స్థానిక పరిశ్రమలకు అనుగుణమైన స్కిల్స్ నేర్పాలి
ప్రాంతీయ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు ( ఐటిఐలు) స్థానిక పాఠశాలలు, కళాశాలలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి. మాధ్యమిక, పాఠశాల స్థాయిలో వృత్తిపరమైన శిక్షణ విద్య కోర్సులను ప్రవేశపెట్టాలి. ముందుగా ప్రాథమికపరమైన వృత్తి విద్యా విషయాలలో వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారు ఉన్నతమైన శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. స్థిరమైన సాంప్రదాయబద్ధమైన సిలబస్ నుండి స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను రూపొందించి దాని ద్వారా నైపుణ్యాలను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది.
డాక్టర్ దాసరి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, శాతవాహన వర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
