
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- ములుగులో 2వేల మంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ
ములుగు, ములుగు : డ్రగ్స్, గంజాయి కారణంగా యువత భవిష్యత్ నాశనం అవుతుందని, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ములుగులోని తంగేడు స్టేడియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాల వినియోగంపై నిఘా పెంచామన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ములుగు కూడా డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. కలెక్టర్దివాకర, ఎస్పీ పి.శబరీష్ మాట్లాడుతూ డ్రగ్స్ అంటే గంజాయి మాత్రమే కాదని సిగరెట్, గుట్కా, జర్దా అది ఏ రూపంలో ఉన్నా డ్రగ్స్ గానే భావించాలని తెలిపారు.
ప్రభుత్వం మత్తుపదార్థాల వినియోగంపై సీరియస్ గా ఉందని, వినియోగించినా, విక్రమించినా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా తంగేడు స్టేడియంలో 2వేల మంది విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియం నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, అడిషనల్ ఎస్పీ సదానందం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.