
గచ్చిబౌలి, వెలుగు: ఓ సాఫ్ట్వేర్ఉద్యోగిని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారుకు హ్యాండ్బ్రేక్వేయకపోవడంతో దూసుకెళ్లి, జీహెచ్ఎంసీ కార్మికుడిని ఢీకొట్టడంతో అతను మృతిచెందాడు. గచ్చిబౌలి పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ఆత్రి ఆనంద్ పవార్(46) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డుపై ఉన్న చెట్లకు నీళ్లు పోసేందుకు వెళ్లాడు. వర్సిటీ రెండో గేట్ వద్ద ట్యాంకర్ ఆపి, జనరేటర్లో పెట్రోల్ పోస్తున్నాడు. అదే సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉమ కారులో గచ్చిబౌలి నుంచి చందానగర్వైపు వెళ్తోంది.
వర్సిటీ బస్టాప్వద్ద కారును రోడ్డుపై ఆపి, పక్కనే పండ్లు కొనేందుకు వెళ్లింది. అయితే, కారు హ్యాండ్ బ్రేక్ వేయక పోవడంతో ముందుకు దూసుకెళ్లి, ఆనంద్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఉమ 108కు ఫోన్ చేసి, ఆనంద్ ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లింది. కాసేపటికే అతను చనిపోయాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.