- ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలు-–2027కు సంబంధించి జగిత్యాల జిల్లా ధర్మపురిలో భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ అశోక్ కుమార్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల పోలీస్ స్టేషన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫున చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్ నియంత్రణ, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు, వీఐపీ ఘాట్లు, పుష్కర ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
ఎస్పీ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా జిల్లాకు ప్రతిరోజూ సుమారు 15లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి ఘాట్కు ప్రత్యేక అత్యవసర మార్గం ఏర్పాటు చేసి, అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు అనిల్ కుమార్, సుధాకర్, రామ్నరసింహా రెడ్డి, పాల్గొన్నారు.
