
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు వివరాలను గద్వాల ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం (జూన్ 26) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తేజేశ్వర్ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ‘‘ప్రియుడు తిరుమల్ రావుతో కలిసి భర్త తేజేశ్వర్ను ఐశ్వర్యే హత్య చేయించింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే హత్య చేశారు. ఐశ్వర్య తల్లితోనూ తిరుమల్ రావుకు సంబంధం ఉంది.
గతేదాడి డిసెంబర్లో ఐశ్వర్య తేజేశ్వర్కు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించాలని తిరుమలరావు అనుకున్నాడు. దీంతో ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి తేజేశ్వర్ను చంపేందుకు స్కెచ్ వేశారు. తేజేశ్వర్ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని ప్లాన్ చేశాడు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్లో మాట్లాడుకునే వారు. చాలాసార్లు తేజేశ్వర్పై అటాక్ చేసేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది.
కానీ అవి విఫలం అయ్యాయి. దీంతో పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ను తీసుకొని వెళ్లారు. అనంతరం కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజేశ్వర్ను చంపారు. తేజేశ్వర్ను చంపిన తర్వాత తిరుమల్ రావు, ఐశ్వర్య లడక్ వెళ్లాలనుకున్నారు. ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన మణిపూర్ హనీమూన్ మర్డర్ గురించి కూడా వీరు మాట్లాడుకున్నారు’’ అని వెల్లడించారు.