
- కుదరదంటూ పొరుగు రాష్ట్రం కొర్రీలు
- కృష్ణా బోర్డు మీటింగ్లో వాడివేడి చర్చ
- విభజన చట్టం ప్రకారం మనకు సాగర్, ఏపీకి శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ
- ప్రస్తుతం ఏపీ హ్యాండోవర్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు
- సాగర్ను కూడా తమ ఎస్పీఎఫ్కు ఇవ్వాలంటూ వింత వాదన
- తెలంగాణకే కేటాయించాలని మన అధికారుల డిమాండ్
- ముందు మన డిమాండ్కు ఓకే చెప్పిన బోర్డు.. వెంటనే అడ్డుపుల్లేసిన ఏపీ
- సీఆర్పీఎఫ్నే కొనసాగించాలంటూ వాదన.. ఒప్పుకున్న బోర్డు చైర్మన్
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ పేచీలు పెడుతున్నది. డ్యామ్ను తెలంగాణకు అప్పగించకుండా కుట్రలకు పాల్పడుతున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఉద్యోగుల ఇన్సెంటివ్స్పై శుక్రవారం జలసౌధలో నిర్వహించిన స్పెషల్ మీటింగ్లో మన అధికారులు సాగర్ డ్యామ్ యాజమాన్య నిర్వహణపై ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నిర్వహిస్తున్నా.. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను తెలంగాణ నిర్వహించాల్సి ఉన్నది.
అయితే, ప్రస్తుతం శ్రీశైలం ఏపీ హ్యాండోవర్లోనే ఉన్నా.. సాగర్ డ్యామ్పై మాత్రం ఏపీ తన పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తున్నది. గతంలో గొడవలు ముదిరి డ్యామ్పై కొట్టుకునేవరకు వెళ్లడంతో కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే మన అధికారులు నాగార్జునసాగర్ డ్యామ్ను అప్పగించాలంటూ ఎప్పటి నుంచో కృష్ణా బోర్డు సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన మీటింగ్లోనూ ఇదే ప్రస్తావించారు. డ్యామ్ను అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పారు.
అయితే, ఏపీ మాత్రం డ్యామ్ను అప్పగించేది లేదంటూ కొర్రీలు పెట్టింది. తామే నిర్వహిస్తామని, తమ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను పెట్టుకుంటామని బోర్డు ముందు వాదించింది. అయితే, తెలంగాణ అధికారులు ఏపీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం డ్యామ్ ఏపీ చేతుల్లో ఉన్నప్పుడు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణనే కదా చూడాల్సింది అని మన అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.
మనకిస్తే వాళ్ల ఆటలు సాగవని..!
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సీఆర్పీఎఫ్ అధీనంలో ఉన్నా.. ఏపీ మాత్రం అడ్డగోలుగా సాగర్ ప్రాజెక్ట్ నుంచి జలదోపిడీకి పాల్పడుతూనే ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరైనా.. తాము మాత్రం జలదోపిడీని ఆపేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి ఉదంతమే అందుకు నిదర్శనం. కొన్ని రోజులపాటు 5 వేల క్యూసెక్కుల నీళ్లే తీసుకోవాలంటూ కృష్ణా బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ.. రోజూ ఏడెనిమిది వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు ఏపీ తరలించుకుపోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణకు సాగర్ ప్రాజెక్టును అప్పగిస్తే తమ ఆటలు సాగవని ఏపీకి భయపం పట్టుకున్నది. అందుకే తెలంగాణకు ప్రాజెక్టును అప్పగించకుండా కుట్రలు చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బోర్డు చైర్మన్ ఓకే..కానీ!
నాగార్జునసాగర్ డ్యామ్ను అప్పగించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు తొలుత కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఓకే అన్నట్టుగానే స్పందించారు. డ్యామ్ నిర్వహణను తెలంగాణనే చూసుకోవాల్సి ఉంటుంది కదా.. అని అన్నారు. ఈ సమయంలో ఏపీ అధికారులు జోక్యం చేసుకుని.. అదెలా సాధ్యమంటూ వాదించారు. ఎస్పీఎఫ్కు ఇవ్వకపోయినా.. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఆధీనంలోనే ఉంది కాబట్టి దానినే కొనసాగించాలని బోర్డుకు తెలిపారు. ఈ క్రమంలో బోర్డు చైర్మన్ కూడా దానికి అంగీకరించారు.
ఎలాగూ డిసెంబర్ 30 వరకు సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉంటుంది కాబట్టి.. అప్పటి వరకూ అదే కొనసాగుతుందని బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. అయితే, మన అధికారులు మాత్రం కచ్చితంగా నాగార్జున సాగర్ డ్యామ్ను తమకు అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా, బోర్డులో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులకు ఇకపై స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వొద్దని సమావేశంలో నిర్ణయించారు. అంతేగాకుండా.. ఇప్పటికే ఇచ్చిన ఇన్సెంటివ్స్ను రికవరీ చేయాలని కేంద్రం ఆదేశాలివ్వగా.. రికవరీ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు.