నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ పేచీ!..చట్ట ప్రకారం తమకే అప్పగించాలన్న తెలంగాణ

నాగార్జునసాగర్ డ్యామ్పై  ఏపీ పేచీ!..చట్ట ప్రకారం తమకే అప్పగించాలన్న తెలంగాణ
  • కుదరదంటూ పొరుగు రాష్ట్రం కొర్రీలు
  • కృష్ణా బోర్డు మీటింగ్​లో వాడివేడి చర్చ
  • విభజన చట్టం ప్రకారం మనకు సాగర్, ఏపీకి  శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ
  • ప్రస్తుతం ఏపీ హ్యాండోవర్​లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు
  • సాగర్​ను కూడా తమ ఎస్​పీఎఫ్​కు ఇవ్వాలంటూ వింత వాదన
  • తెలంగాణకే కేటాయించాలని మన అధికారుల డిమాండ్​
  • ముందు మన డిమాండ్​కు ఓకే చెప్పిన బోర్డు.. వెంటనే అడ్డుపుల్లేసిన ఏపీ
  • సీఆర్​పీఎఫ్​నే కొనసాగించాలంటూ వాదన.. ఒప్పుకున్న బోర్డు చైర్మన్​

హైదరాబాద్​, వెలుగు:  నాగార్జునసాగర్​ డ్యామ్​పై ఏపీ పేచీలు పెడుతున్నది. డ్యామ్​ను తెలంగాణకు అప్పగించకుండా కుట్రలకు పాల్పడుతున్నది. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) ఉద్యోగుల ఇన్సెంటివ్స్​పై శుక్రవారం జలసౌధలో నిర్వహించిన స్పెషల్​ మీటింగ్​లో మన అధికారులు సాగర్​ డ్యామ్​ యాజమాన్య నిర్వహణపై ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నిర్వహిస్తున్నా.. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ను తెలంగాణ నిర్వహించాల్సి ఉన్నది. 

అయితే, ప్రస్తుతం శ్రీశైలం ఏపీ హ్యాండోవర్​లోనే  ఉన్నా.. సాగర్​ డ్యామ్​పై మాత్రం ఏపీ తన పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తున్నది. గతంలో గొడవలు ముదిరి డ్యామ్​పై కొట్టుకునేవరకు వెళ్లడంతో కేంద్రం సీఆర్​పీఎఫ్​ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే మన అధికారులు నాగార్జునసాగర్​ డ్యామ్​ను అప్పగించాలంటూ ఎప్పటి నుంచో కృష్ణా బోర్డు సమావేశాల్లో డిమాండ్​ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన మీటింగ్​లోనూ ఇదే ప్రస్తావించారు. డ్యామ్​ను అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

అయితే, ఏపీ మాత్రం డ్యామ్​ను అప్పగించేది లేదంటూ కొర్రీలు పెట్టింది. తామే నిర్వహిస్తామని, తమ స్పెషల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​ (ఎస్పీఎఫ్​)ను పెట్టుకుంటామని బోర్డు ముందు వాదించింది. అయితే, తెలంగాణ అధికారులు ఏపీకి గట్టిగానే కౌంటర్​ ఇచ్చారు. శ్రీశైలం డ్యామ్​ ఏపీ చేతుల్లో ఉన్నప్పుడు.. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణనే కదా చూడాల్సింది అని మన అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.

మనకిస్తే వాళ్ల ఆటలు సాగవని..!

నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ సీఆర్​పీఎఫ్​ అధీనంలో ఉన్నా.. ఏపీ మాత్రం అడ్డగోలుగా సాగర్​ ప్రాజెక్ట్​ నుంచి జలదోపిడీకి పాల్పడుతూనే ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరైనా.. తాము మాత్రం జలదోపిడీని ఆపేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి ఉదంతమే అందుకు నిదర్శనం. కొన్ని రోజులపాటు 5 వేల క్యూసెక్కుల నీళ్లే తీసుకోవాలంటూ కృష్ణా బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ.. రోజూ ఏడెనిమిది వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు ఏపీ తరలించుకుపోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణకు సాగర్​ ప్రాజెక్టును అప్పగిస్తే తమ ఆటలు సాగవని ఏపీకి భయపం పట్టుకున్నది. అందుకే తెలంగాణకు ప్రాజెక్టును అప్పగించకుండా కుట్రలు చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బోర్డు చైర్మన్​ ఓకే..కానీ!

నాగార్జునసాగర్​ డ్యామ్​ను అప్పగించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు తొలుత కృష్ణా బోర్డు చైర్మన్​ అతుల్​ జైన్​ ఓకే అన్నట్టుగానే స్పందించారు. డ్యామ్​ నిర్వహణను తెలంగాణనే చూసుకోవాల్సి ఉంటుంది కదా.. అని అన్నారు. ఈ సమయంలో ఏపీ అధికారులు జోక్యం చేసుకుని.. అదెలా సాధ్యమంటూ వాదించారు. ఎస్​పీఎఫ్​కు ఇవ్వకపోయినా.. ప్రస్తుతం సీఆర్​పీఎఫ్​ ఆధీనంలోనే ఉంది కాబట్టి దానినే కొనసాగించాలని బోర్డుకు తెలిపారు. ఈ క్రమంలో బోర్డు చైర్మన్​ కూడా దానికి అంగీకరించారు. 

ఎలాగూ డిసెంబర్​ 30 వరకు సాగర్​ ప్రాజెక్ట్​ నిర్వహణ సీఆర్​పీఎఫ్​ అధీనంలోనే ఉంటుంది కాబట్టి.. అప్పటి వరకూ అదే కొనసాగుతుందని బోర్డు చైర్మన్​ పేర్కొన్నారు. అయితే, మన అధికారులు మాత్రం కచ్చితంగా నాగార్జున సాగర్​ డ్యామ్​ను తమకు అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా, బోర్డులో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులకు ఇకపై స్పెషల్​ ఇన్సెంటివ్స్​ ఇవ్వొద్దని సమావేశంలో నిర్ణయించారు. అంతేగాకుండా.. ఇప్పటికే ఇచ్చిన ఇన్సెంటివ్స్​ను రికవరీ చేయాలని కేంద్రం  ఆదేశాలివ్వగా.. రికవరీ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు.