హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఎగ్జామ్ ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 20 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆ విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13తోనే గడువు ముగిసింది. వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించామని డైరెక్టర్ వెల్లడించారు. కాగా.. రూ.50 ఫైన్ తో ఈ నెల 29 వరకు, రూ.200 ఫైన్ తో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 జరిమానాతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని శ్రీహరి వివరించారు. ఇక రెగ్యులర్ స్టూడెంట్లకు రూ.125 మాత్రమే ఎగ్జామ్ ఫీజు ఉందని వెల్లడించారు.
