
- ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శ
- ఎమ్మెల్యే నాయిని ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు : ‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మారిన చరిత్ర కొండా దంపతులది.. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సాఆర్సీపీ, బీఆర్ఎస్లో పనిచేసి.. చివరికి మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు’ అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నివాసంలో మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ సారయ్య మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే ఐదు సార్లు పార్టీ మారిన కొండా దంపతులు.. కాంగ్రెస్ను కాపాడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొండా మురళీకి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. తామే ఎమ్మెల్యేలను గెలిపించాలని కొండా దంపతులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొండా మురళీ 2001లో సంగెం జడ్పీటీసీగా పోటీ చేసి చిత్తుగా ఓటమి చెందారని చెప్పారు. కొండా దంపతుల తీరు నచ్చకే 2018 కేసీఆర్ వారికి టిక్కెట్ ఇవ్వలేదన్నారు.
వైఎస్, కేసీఆర్ వంటి నేతల సహకారంతో ఎదిగిన కొండా మురళి ఇప్పుడు వారినే తిట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం తరఫున మల్లు రవి షోకాజ్ నోటీసు జారీ చేస్తే... తాను ఎవరు పిలవకున్నా వచ్చానని అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు మాట్లాడుతూ.. కొండా మురళీ తన నియోజకవర్గంలోని కార్యకర్తలపై సైతం అక్రమ కేసులు పెట్టి వేధించాడన్నారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కొండా దంపతులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలను తిట్టడం వారికి అలవాటేనన్నారు.