వివాహేతర సంబంధం: విషం తాగిన తల్లీకూతుళ్లు

వివాహేతర సంబంధం: విషం తాగిన తల్లీకూతుళ్లు

నిర్మల్, వెలుగు: కూతురుకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి మృతిచెందగా తల్లి ప్రమాదం నుంచి బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పూజిత(30), పోతన్న భార్యభర్తలు. పూజిత అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత ఆదివారం రాఖీ పండుగ రోజు మూడేళ్ల చిన్నకూతురును తీసుకొని శ్రీకాంత్‍తో పూజిత వెళ్లిపోయింది. విషయం తెలియడంతో పోతన్న రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి నిర్మల్ పట్టణంలోని సత్యం లాడ్జి వద్ద పూజిత, ఆమె కూతురు స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని హాస్పిటల్‍కు తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందింది. పూజిత నిర్మల్‍ ఏరియా హాస్పిటల్‍లో చికిత్స పొందుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీకాంత్ మోసం చేశాడని ఐసీయూలో ఉన్న పూజిత చెప్పింది. రెండు రోజులు తనను నిజామాబాద్, ఆర్మూర్‍కు తీసుకెళ్లాడని, బుధవారం నిర్మల్ బస్టాండ్‍ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. దాంతో ఆత్మహత్య చేసుకునేందుకు కూతురుకు విషమిచ్చి తాను తాగినట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‍ సీఐ శ్రీనివాస్‍ చెప్పారు.