నత్త నడకన టూరిజం పనులు..! ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని అద్దాల మేడ, హరిత హోటల్

నత్త నడకన టూరిజం పనులు..! ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని అద్దాల మేడ, హరిత హోటల్
  • జాడలేని ట్రెక్కింగ్, జిప్​లైన్ అడ్వెంచర్స్ టూరిజం
  • అధికారులు ఫోకస్ పెడితే అద్భుతమైన లోకేషన్స్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో టూరిజం అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయి. కిన్నెరసానిలోని అద్దాల మేడ, ఇల్లెందు క్రాస్​ రోడ్డులోని హరిత హోటల్​పనులు పదేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్​టూరిజం ఫైల్స్​కే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అద్భుతమైన టూరిజం లోకేషన్స్ ఉన్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. 

స్లోగా పనులు..

టూరిజం డెవలప్​మెంట్​లో భాగంగా రూ.23 కోట్లతో ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద హరిత హోటల్, కిన్నెరసాని ప్రాజెక్టులో అద్దాల మేడ, కాటేజీల నిర్మాణ పనులను15 ఏండ్ల కిందట ప్రారంభించారు. ఈ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. పనులు జరుగుతున్న తీరుపై గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీసర్లతో సమావేశమై చర్చించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పక్కనే కాటేజీలను నిర్మించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఈ కాటేజీల్లో ఉంటూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించే అవకాశాలున్నాయి.  

జాడలేని ట్రెక్కింగ్, జిప్ లైన్..

జిల్లాలోని పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు, ఇల్లెందులోని ఊరగుట్ట(కోరగుట్ట), మణుగూరు ప్రాంతంలోని రథం గుట్ట, తుమ్మల చెరువు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ టూరిజానికి ఆఫీసర్లు ప్లాన్​చేశారు. గతేడాది అడ్వెంచర్​ టూరిజంలో భాగంగా మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ ప్రాంతాల్లో పూణెకు చెందిన నైల్​ఇండియా అడ్వంచర్స్​లిమిటెడ్​ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. పాల్వంచలో జిప్​లైన్ టూరిజం ఏర్పాటు చేసేందుకు జిల్లా యువజనశాఖ ఆఫీసర్లతో కలిసి స్టడీ చేశారు. నెలలు గడుస్తున్నా ఆ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. 

నది మధ్యలో వీరభద్రస్వామి టెంపుల్..

గోదావరి నది మధ్యలో చిన్న గుట్టపై మోతే వీరభద్రస్వామి టెంపుల్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా శతాబ్దాల కాలం నాటి ఈ టెంపుల్​కు క్షేత్ర పాలకుడిగా సూర్య భగవానుడు ఉండడం విశేషం. ఈ టెంపుల్​కు చేరాలంటే బూర్గంపహాడ్​మండలంలోని సారపాక నుంచి గోదావరిలో పడవపై వెళ్లాల్సి ఉంటుంది. భద్రాచలం సమీపంలోని ఎటపాక నుంచి వెళ్తే గోదావరి నది ఇసుకలో అర కిలోమీటర్ వరకు మోకాలి లోతు నీటిలో నడవాల్సి ఉంటుంది. మహాశివరాత్రికి ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఆఫీసర్లు ప్లాన్​చేస్తే అద్భుతమైన టూరిజం లోకేషన్స్​కు ఈ ప్రాంతం నెలవుగా అయ్యే అవకాశం ఉంటుంది. 

అభివృద్ధి చేస్తే అద్భుతాలే..

పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులో ఆకర్షణాలకు కొదవ లేదు. పాల్వంచలోని డీర్ పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ పార్కులో పలు రకాల జింకలున్నాయి. పక్కనే ఆకట్టుకున్న హంసలున్నాయి. వర్షాకాలంలో కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తితే.. దీన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు. కానీ ఇక్కడ పర్యాటకులకు సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కోతులు పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.