రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
  • పెద్దఅంబర్ పేట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు  చెందిన రమావత్ మాన్ సింగ్(38) యాదగిరిగుట్ట ట్రాఫిక్ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులానే గురువారం డ్యూటీ ముగించుకొని తన ఇంటికి బైక్ పై వస్తున్నాడు.

పెద్దఅంబర్ పేట్ కు రాగానే మాన్ సింగ్ ముందు వెళ్తున్న టిప్పర్ సడెన్ బ్రేక్ వేసింది. దాంతో మాన్ సింగ్ బైక్..టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కానిస్టేబుల్ మాన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్షంగా బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.