ఒక్క రోజు తేడాతో కొడుకు, తండ్రి కన్నుమూత

ఒక్క రోజు తేడాతో కొడుకు, తండ్రి కన్నుమూత
  • హనుమకొండ జిల్లా సూరారంలో విషాదం 

ఎల్కతుర్తి, వెలుగు:  ఒక్క రోజు తేడాతో కొడుకు, తండ్రి చనిపోయిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మొలుగూరి పోశయ్య (75), రాజమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కొడుకు శ్రీనివాస్(55) పదమూడేండ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల కింద చాతిలో నొప్పిగా ఉందని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని పోశయ్య చెప్పడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఆస్పత్రిలో చూపించగా, డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు. గుండె ఆపరేషన్ చేయాలని, ఖర్చు ఎక్కువ అవుతుందని, రిస్క్ కూడా ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళనలో పడ్డారు. 

తండ్రి అనారోగ్యం వార్త విన్న శ్రీనివాస్ ఆందోళన చెందగా  మెడ నరాలు దెబ్బతినడంతో పరిస్థితి సీరియస్ అయింది. దీంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితిపై హైదరాబాద్ లోని కుటుంబసభ్యులకు తెలియడంతో పోశయ్యను తీసుకుని ఊరికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోగా..  సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు చేపట్టారు. కొడుకును చివరి చూపు చూసేందుకు వెళ్లిన పోశయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు పోశయ్యకు వైద్యం చేయిస్తుండగా ఆయన సాయంత్రం చనిపోయాడు.  తండ్రి, కొడుకు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోశయ్య అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి.