ఎనుమాముల మార్కెట్ లో పసుపు రైతుల ఆందోళన .. మద్దతు ధర కల్పించాలని డిమాండ్

ఎనుమాముల మార్కెట్ లో పసుపు రైతుల ఆందోళన .. మద్దతు ధర కల్పించాలని డిమాండ్

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్  ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం మార్కెట్ కు వచ్చిన రైతులు పసుపు ధర బాగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్​ పసుపు ధర రూ.12,500 పలుకుతుండగా, కనిష్ట ధర రూ.3 వేలు ఉంది. మోడల్  ప్రైస్  రూ. 7 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉంది. 

గరిష్ట, కనిష్ట ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో కాంటాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అనంతరం ఆందోళన చేసిన కొంత మంది రైతులు పంటను అలాగే ఉంచుకోగా, మిగిలిన రైతులు అమ్ముకున్నారు. 

ప్రొద్దుటూరు ట్రేడర్స్ కు మెమో..

పసుపు రేట్​ను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రొద్దుటూరు ట్రేడర్స్  యజమాని నారాయణకు మార్కెట్  కార్యదర్శి జీవీ రెడ్డి మెమో జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.