ఇంట్లో కిరాయికి ఉండి.. మావోయిస్టుల పేరుతో బెదిరింపులు

ఇంట్లో కిరాయికి ఉండి.. మావోయిస్టుల పేరుతో బెదిరింపులు
  • ఇద్దరు అరెస్ట్, 13 నాటు బాంబులు సీజ్

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడికి మావోయిస్టుల పేరుతో లేఖ రాసి, డబ్బులు డిమాండ్ చేసిన కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఏపీలోని గన్నవరానికి చెందిన ఎర్రంశెట్టి రాజు (33) మేడ్చల్ జిల్లాలోని షాపూర్​నగర్​లో​నివాసం ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు నెలల కింద అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈజీగా డబ్బులు సంపాదించానికి మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. 

ఇందుకు తాను అద్దెకు ఉంటున్న రవీందర్ గౌడ్​ను టార్గెట్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన మిత్రుడు గన్నవరానికి చెందిన కందూలేరి రాజు (24)ను పిలిపించుకున్నాడు. ఈ నెల 21న అర్ధరాత్రి రవీందర్ గౌడ్​ఇంట్లోకి ప్రవేశించి ఇంటి ముందు ఉన్న తులసి మొక్కలను ధ్వంసం చేశాడు. అనంతరం తాము మావోయిస్టులమని రూ.50 లక్షలు ఇవ్వకుంటే తన కొడుకును చంపడంతోపాటు ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపు లేఖ రాసి, ఎర్ర టవల్​తోపాటు కారుపై ఉంచి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

దాదాపు 500 సీసీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, తాము లెటర్ రాసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వైజాగ్​కు వెళ్లి నాటు బాంబులు తెచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. వారి వద్ద 13 కంట్రీ మేడ్ బాంబులు, ఒక బెదిరింపు లేఖ, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎర్రంశెట్టి రాజుపై గతంలో గన్నవరం పీఎస్​లో ప్రాపర్టీ కేసులో నేరస్తుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.